ఖమ్మం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్, కూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు కోసం సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. గత ఎన్నికలకు ఇప్పటికీ ఖమ్మం రాజకీయాల్లో చాలా మార్పులు జరగడంతో విజయం ఎవరిని వరించనుందన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.గత ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన పువ్వాడ అజయ్ ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్కు పోలైన ఓట్లు ఇప్పుడు టీఆర్ఎస్కు బదిలీ అవుతాయా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. అజయ్ మాత్రం తనదే విజయం అన్న ధీమాతో ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,38,000 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 35000మంది ఓటర్లు ఉన్నారు. మైనారిటీలంతా గంపగుత్తగా ఎవరికి ఓటు వేస్తే వారిని విజయం వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత ఎన్నికల్లో వీరంతా కాంగ్రెస్ పక్షానే నిలబడ్డారు. రాబోయే ఎన్నికల్లో వారి మొగ్గు ఎటువంటి వైపు ఉంటుందనే దానిపై ఇక్కడి ఫలితం ఆధారపడి ఉంది. దీంతో మైనారిటీల ఓట్ల కోసం పువ్వాడ, నామా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.టీఆర్ఎస్కు ఓటు వేయడటమంటే బీజేపీకి ఓటు వేసినట్టే అని మైనారిటీలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు నామా నాగేశ్వరరావు. ఇటీవలే టీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బుడాన్ బేగ్ పార్టీని వీడటం కూడా గులాబీ దండుపై ప్రభావం చూపిస్తుందంటున్నారు. బుడాన్ బేగ్ కూటమికి మద్దతు తెలిపితే మైనారిటీలు నామా వైపే మొగ్గుచూపుతారా?.. లేక స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటారా? అన్న చర్చ సాగుతోంది.మొత్తం మీద ఖమ్మం నియోజకవర్గంలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న మైనారిటీలు ఇరు పార్టీల అభ్యర్థులకు దడ పుట్టిస్తున్నారు. వారి ఓటు తమ గెలుపోటములను ప్రభావం చేసే అవకాశం ఉండటంతో.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఓట్లను వదలుకోకూడదన్న కృతనిశ్చయంతో ఇద్దరూ ప్రచారం చేశారు. అయితే అంతిమంగా మైనారిటీలంతా ఎవరి పట్ల విశ్వసనీయత కనబరుస్తారు.. ఏ పార్టీకి ఓటేయబోతున్నారు అన్నది తెలియాలంటే డిసెంబర్ 11 ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.