సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాలను రాత్రికి రాత్రే ఎందుకు సెలవుపై పంపించారని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. గత జులై నుంచి వాళ్లని భరిస్తున్నామన్నారు.. మరి అకస్మాత్తుగా ఎందుకు సెలవుపై పంపించారు అని అడిగింది. సీబీఐ చీఫ్పై ఇలాంటి నిర్ణయం తీసుకునేప్పుడు సెలక్షన్ కమిటీని ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించింది. ‘కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆలోక్, అస్థానాలపై చర్యలు తీసుకోవడానికి ఏర్పడిన పరిణామాలు రాత్రికి రాత్రి జరగలేదు. మీరు అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవడానికి కారణం అది కాదు’ అని సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ అభిప్రాయపడ్డారు.నిన్న జరిగిన విచారణలో.. అనివార్య కారణాల వల్ల వారిని సెలవుపై పంపాలని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వెల్లడించారు. వారు గత కొన్ని నెలలుగా ఘర్షణ పడుతుండటంతో సీబీఐ బాహాటంగా అపహాస్యం పాలైందని.. అందుకే తాము జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని కేంద్రం సుప్రీంకోర్టుకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆలోక్ వర్మ తనను కేంద్రం సెలవుపై పంపించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు జరగుతున్నాయి.సీబీఐ కేసుల దర్యాప్తునకు బదులుగా వారే ఒకరిపై ఒకరు దర్యాప్తు చేసుకుంటున్నారని కేంద్ర విజిలెన్స్ కమిషన్ సుప్రీంకోర్టుకు వెల్లడించింది. అనుకోని పరిణామాలను కూడా సీవీసీ ఎదుర్కోవాల్సి వస్తుందని, తగిన విధంగా స్పందించాల్సి వస్తుందని, లేదంటే సీవీసీ ప్రభావ రహితంగా మారుతుందని పేర్కొంది. సీబీఐ అంశంపై సీవీసీ దర్యాప్తు చేపట్టిందని, కానీ ఆలోక్ వర్మ కొన్ని నెలల పాటు సంబంధిత దస్త్రాలు ఇవ్వలేదని సీవీసీ కోర్టుకు వెల్లడించింది.