YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

బాబోయ్...వినయవిధేయ రామ

 బాబోయ్...వినయవిధేయ రామ
అసలు రామ్ చరణ్‌కి నటించడం వచ్చా.. ఏదో మెగాస్టార్ చిరంజీవి కొడుకు కాబట్టి సినిమాల్లో రాణిస్తున్నాడు కాని ఆయనకు నటనే రాదంటూ వచ్చే కామెంట్స్‌కి ‘రంగస్థలం’ సినిమాతో సమాధానం చెప్పారు రామ్ చరణ్. చిట్టిబాబు పాత్రతో నటన రాదంటూ వాగిన నోళ్లకు ఫెవీక్విక్ లాంటి కిక్ ఇచ్చాడు. నటించడం రాక కాదు.. నటింపచేసే వాడు.. తనలోని నటుడ్ని వాడుకునే దమ్మున్న దర్శకుడు లేక అంటూ తన చిట్టిబాబు పాత్రతో తన విశ్వరూపాన్ని చూపించారు రామ్ చరణ్. దీంతో ఈ చిత్రం తరువాత రామ్ చరణ్ ఇమేజ్ ఒక్కసారిగా రెండింతలయ్యింది. ఈ తరుణంలో మాస్ డైరెక్టర్‌గా పేరొందిన హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి డైరెక్షన్‌లో రామ్ చరణ్ మూవీ అంటే ప్రేక్షకుల అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. అయితే ఆ అంచనాలను తలకిందులు చేసేశాడు బోయపాటి శ్రీను. కథలోకి వెళ్తే.. అనాధలైన ఐదుగురు పిల్లల ఫ్లాష్ బ్యాక్ కథతో సినిమా మొదలుపెట్టాడు బోయపాటి. ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేష్‌, ర‌వివ‌ర్మ‌, మ‌ధునంద‌న్‌ నలుగురూ అనాధలు. చిన్నతనంలో చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవిస్తుంటారు. బ్రతుకు భారం అనిపించి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న వీరిని ముళ్ల పొదల్లో నుండి వినిపించిన మరో అనాధ ఏడుపు బ్రతుకుపై ఆశ కలిగేలా చేస్తుంది. అతడే రామ్ (రామ్ చరణ్). ఈ ఐదుగురు అనాధలను డాక్టర్ చలపతిరావు చేరదీసి ఆదరిస్తారు. పెద్దవాడైన భువన్ కుమార్ (ప్రశాంత్) ఐఏఎస్ చదివి ఛీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తుంటారు. సిన్సియర్ అధికారిగా ఏ రాష్ట్రానికి వెళ్లినా ఎన్నికలకు తావు ఇవ్వకుండా సవ్యంగా జరిపిస్తూ.. అధికార, ప్రతిపక్షపార్టీల్లో వణుకు పుట్టిస్తాడు భువన్ కుమార్. ఈ తరుణంలో వైజాగ్ నుండి బీహార్ వరకు శత్రువులు తయారై భువన్ కుమార్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తుంటారు. ఈ కుటుంబానికి రక్షణ వలయంలా ఉంటూ కాపాడుతుంటాడు రామ్. వైజాగ్‌ ఎన్నికల్లో పందెం పరుశురాం (ముఖేష్ రుషి) ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతుండటంతో రామ్ సాయంతో అడ్డుకట్ట వేస్తాడు ప్రశాంత్. దీంతో రామ్ కుటుంబాన్ని అంత చేయడానికి ప్రయత్నిస్తారు పందెం పరశురాం. ఇంతలో బీహార్‌ ఎన్నికల అధికారిగా బదిలీ అయిన భువన్ కుమార్‌ బీహార్ ప్రాంతానికి నియంతలా వ్యవహరించే రాజా సాబ్ (వివేక్ ఒబెరాయ్)‌తో విభేదిస్తాడు. అక్కడ ఎలక్షన్స్ కాదు.. ఓన్లీ సెలక్షన్స్ అనే రాజా సాబ్ అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ అక్కడ ఎన్నికలు జరిపించేందుకు భువన్ కుమార్‌ ప్రయత్నిస్తారు. దీంతో భువన్ కుమార్‌‌ని అతనికి తోడుగా ఉన్న తమ్ముళ్లు రవివర్మ, ఆర్యన్ రాజేష్‌లను బంధిస్తాడు రాజా సాబ్. అతని వల్ల రామ్ కుంటుబానికి తీరని నష్టం జరుగుతుంది. ఇంతకీ రాజా సాబ్‌ నుండి రామ్ తన కుంటుంబాన్ని ఎలా రక్షించుకోగలిగాడు. భువన్ కుమార్ ఏమయ్యారు..? అన్నది తెరపై చూడాల్సిందే. విశ్లేషణకు వెళ్తే.. ముందుగా చిత్ర దర్శకుడు దర్శకుడు బోయపాటి శ్రీను గురించే మాట్లాడుకోవాలి. భద్ర, సింహా, లెజెండ్, సరైనోడు తదితర బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను రూపొందించిన బోయపాటి శ్రీనేనా ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది అనే సందేహం కలగకమానదు ‘వినయ విధేయ రామ’ సినిమా చూసిన ప్రేక్షకులకు. బోయపాటి సినిమాలో హీరో ఆవేశం వెనుక ఎమోషన్ ఉంటుంది. అందుకే తెగ నరుకుతున్నా ఇంకా నరికితే బావుండు అని ప్రేక్షకులు కేకలు పెట్టేలా బలమైన సీన్లు రాసుకుంటారు. కథను ఆసక్తిగా మలుస్తారు. కాని ఇందులో అతిమాత్రమే కనిపిస్తుంది. మాస్ డైరెక్టర్ అనే పేరును సార్ధకం చేసుకునేందుకు ఆయన సినిమాలో రక్తపాతం, నరుక్కోవడాలు, చంపుకోవడాలు కామన్‌గానే ఉంటాయి. అయితే ఈ సినిమాలో వాటి మోతాను మరింత పెంచాడు బోయపాటి. అదే సమయంలో ప్రేక్షకుల స్వాగతించని సీన్స్‌తో తలలు బొప్పి కట్టించాడు. అప్పట్లో చిటికేస్తే కదిలి వచ్చే కుర్చీ.. కేక పెడితే వెనక్కి వెళ్లిపోయే ట్రైన్ సీన్‌లు చూసి బాబోయ్ అనుకునే వాళ్లు ప్రేక్షకులు. అయితే అలాంటి సీన్‌లు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. రామ్ చరణ్ కదిలే ట్రైన్ మీదికి ఉరికి మరీ నిమిషాల్లో గుజరాత్ నుండి బీహార్ వచ్చేయడం.. విలన్స్ తల నరికితే వారి తలలు ఆకాశంలోకి ఎగిరపోవడం.. అక్కడే ఉన్న గ్రద్ధలు ఆ తలలను ఎత్తుకుపోవడం.. ఇండియన్ ఆర్మీకి సాధ్యం కాని పనిని రామ్ చరణ్‌ ఒక్కడే చేసి మూడొందల మందిని చంపేయడం.. విషంతో ఉన్న పాము కరిస్తే మనిషి చనిపోకుండా పామే తిరిగి చనిపోవడం లాంటి వాస్తవాలకు దూరంగా ఉన్న సీన్స్ ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. ఫస్టాఫ్ మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్‌తో బాగానే లాక్కొచ్చిన బోయపాటి.. సెకండాఫ్‌లో కంట్రోల్ తప్పారు. ప్రేక్షకులకు చుక్కలు చూపించారు. మంచి ఎమోషన్ ఫ్లాష్ బ్యాక్ సీన్‌తో కథ మొదలు పెట్టిన దర్శకుడు దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. సెకండాఫ్‌లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. కథనంలో నెమ్మదితో పాటు కొత్తదనం లేకపోగా.. ఆయన గత చిత్రాలను గుర్తిచేశారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ కష్టం ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. రామ్ కష్టపడ్డాడు కాని.. ప్రతిఫలం దక్కకుండా చేశారు బోయపాటి. సిక్స్ ప్యాక్‌లో రామ్ చరణ్‌ ఆకట్టుకున్నారు. డాన్స్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్, యాక్షన్ సన్నివేశాల్లో బెటర్ పెర్ఫామెన్స్ ఇచ్చారు.ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన కైరా అద్వానీ ఒకటి రెండు సీన్లకు మాత్రమే పరిమితం అయ్యింది. పాటల్లో రామ్ చరణ్‌తో స్టెప్పులకు మాత్రమే సీన్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రశాంత్ భార్యగా చేసిన సీనియర్ హీరోయిన్ స్నేహకు ప్రాధన్యత ఉన్న పాత్ర దక్కింది. ఇక రామ్ చరణ్‌కి బ్రదర్స్‌గా నటించిన ఆర్యన్ రాజేష్ పరిధి మేర బాగానే నటించారు. ప్రతినాయకుడిగా నటించిన వివేక్ ఒబెరాయ్ రక్తికట్టించాడు. రామ్ చరణ్‌తో తలపడిన సన్నివేశం బాగానే వర్కౌట్ అయ్యింది. కామెడీ పరంగా ఫస్టాఫ్‌లో హేమ, పృథ్వీలు నవ్వించే ప్రయత్నం చేశారు. పప్పీగా రామ్ అత్త పాత్రలో హేమ ఆకట్టుకునే ప్రయత్నం చేసినా.. కొన్ని సీన్లు ఓవర్‌గా అనిపిస్తాయి. మ్యూజిక్ పరంగా దేవి శ్రీ ప్రసాద్ పెద్దగా ఆకట్టుకోలేదు. పాటలు పర్వాలేదనిపించినా.. గత చిత్రాలతో పోల్చుకుంటే నేపథ్య సంగీతం సరిగా కుదరలేదు. రిషి, ఆర్థర్ విలియమ్ సన్ సినిమాటోగ్రఫీ బాగుంది. కణల్ కణ్ణన్ స్టంట్స్ కాస్త ఓవర్‌గా అనిపిస్తాయి. సెకండాఫ్‌ మీర సాగదీసినట్టు అనిపిస్తుంది. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. డీవీవీ దానయ్య బడ్జెట్ భారీగా పెట్టడంతో సినిమా రిచ్‌గా కనిపిస్తుంది. ఓవరాల్‌గా.. ఈ సినిమా గురించి బోయపాటి భాషలో చెప్పాలంటే.. తడిచిపోయిన అగ్గిపుల్ల వెంటనే అంటుకోదు కాని.. రామ్ చరణ్ తడిచిన అగ్గిపుల్ల కాదు వెలిగే నిప్పు. రక్తపాతం సృష్టించి ఆర్పేశాడు. అలసిపోయిన కోడి నీరసంగా వచ్చి నూనెలో పడుకుంటే పకోడి కాక ఇంకేమి అవుతుంది ‘వినయ విధేయ రామ’. 

Related Posts