YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వంటేరు చేరికతో హరీశ్ భవితవ్యంపై అభిమానుల్లో ఆందోళన

వంటేరు చేరికతో హరీశ్ భవితవ్యంపై అభిమానుల్లో ఆందోళన
టీఆర్ ఎస్ అగ్రనేతల్లో ఒకరైన హరీశ్ రావు పార్టీలో ఇన్నాళ్లూ ఓ వెలుగు వెలిగారు. ఇప్పుడు మాత్రం ఆయన పరిస్థితి తీసుకట్టుగా మారింది. సిద్ధిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కుమారుడు కేటీఆర్ కు బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీలో హరీశ్ ప్రాధాన్యాన్ని కేసీఆర్ తగ్గించారు. తాజాగా వంటేరు ప్రతాప్ రెడ్డి చేరికతో హరీశ్ కే అధిక నష్టం జరిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వంటేరు చేరికతో ఆయన పరిస్థితి మరింత దిగజారిందని  పేర్కొంటున్నారు.ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ స్థానం బాధ్యతలను హరీశే ఇన్నాళ్లూ చూసుకున్నారు. అక్కడ కేసీఆర్ పై పోటీ చేసి ఓడిపోయిన వంటేరు ఇప్పుడు టీఆర్ ఎస్ లో చేరిపోయారు. దీంతో గజ్వేల్ లో గులాబీ పార్టీ బాధ్యతలు వంటేరు చేతిలోకి వెళ్లినట్లే. అంటే ఇప్పుడు హరీశ్ కేవలం సిద్ధిపేటలో సాదాసీదా ఎమ్మెల్యేగా పరిమితమవ్వాల్సిందే. పార్టీలో పదవి లేదు. మంత్రి పదవి ఇంకా రాలేదు. అది వస్తుందో లేదో కూడా అర్థం కావట్లేదు. గజ్వేల్ బాధ్యతలు చేతి నుంచి జారిపోయాయి. ఈ నేపథ్యంలో టీఆర్ ఎస్ లో హరీశ్ భవితవ్యంపై ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది.కొంతకాలంగా కేసీఆర్-కేటీఆర్ ఉమ్మడి మెదక్ జిల్లాపై ప్రధానంగా దృష్టిసారించారు. ఆపరేషన్ మెదక్ పేరుతో టీఆర్ ఎస్ ను జిల్లాలో బలోపేతం చేస్తున్నారు. జిల్లాలో తనకు సన్నిహితుడైన మారెడ్డి శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ పదవిని కేటీఆర్ ఇటీవలే ఇప్పించారు. జిల్లా వ్యాప్తంగా పలువురు నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు. వారిలో పలువురికి కీలక పదవులు కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా మెదక్ లో హరీశ్ ప్రాబల్యాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి

Related Posts