నేతల అభిప్రాయం, రాహుల్ ఆశీస్సులతో సీఎల్పీ నేతనయ్యానని భట్టి విక్రమార్క తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలందరినీ కలుపుకుని ముందుకెళ్తానని చెప్పుకొచ్చారు. మృదువుగానైనా, కఠినంగానైనా ప్రభుత్వంపై పోరాడుతానని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిబద్ధత కలిగిన సైనికులని, ఎవరూ పార్టీ మారరని తెలిపారు. ప్రతిపక్షం కూడా ఉంటేనే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవడం దుర్మార్గమని భట్టి విక్రమార్క మండిపడ్డారు. సమిష్టిగా తాను ముందుకెళతానని, అసెంబ్లీలో ప్రజల గొంతుకై పనిచేస్తానని భట్టి విక్రమార్క తేల్చి చెప్పారు. గవర్నర్ నరసింహన్ ప్రసంగంలో కొత్తదనం లేదని దుయ్యబట్టారు. నిరుద్యోగుల గురించి వాస్తవాలు చెబితే నమ్మేవాళ్లమని, సభను హుందాగా నడుపుతారని ఆశిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్కు తమ ఎమ్మెల్యేలు లొంగరని, తమ ఎమ్మెల్యేలపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని భట్టి ఆరోపించారు.