యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
సీతారామ, పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు అవసరమైన అటవీ భూముల బదలాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం తుది అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ అనుమతుల నేపథ్యంలో భూముల బదలాయింపునకు రెండో దశ అనుమతులు లభించాయి. సీతారామ ప్రాజెక్టు కోసం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని 1531 హెకార్ల అటవీ భూమిని బదిలీ చేయనున్నారు. మణుగూరు, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, ఖమ్మం అటవీ డివిజన్లకు చెందిన భూమిని కాల్వలు, సొరంగాల తవ్వకం, విద్యుత్ లైన్ల కోసం భూమి బదిలీ చేశారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల కోసం 204 హెక్టార్ల అటవీ భూమిని బదిలీ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట అటవీ డివిజన్కు చెందిన భూమిని మొదటి ఎత్తిపోతల పంప్ హౌజ్, నార్లాపూర్ జలాశయం, నార్లాపూర్ - ఏదుల జలాశయాల మధ్య సొరంగం పనుల కోసం వినియోగిస్తారు. ఈ మేరకు ఆయా ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్లకు భూ బదలాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.