యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు తెలంగాణలో 31 జిల్లాలు ఉండగా తాజాగా నారాయణపేట, ములుగు జిల్లాలను ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో తెలంగాణలో జిల్లాల సంఖ్య 33కు చేరింది.రెండు జిల్లాల ఏర్పాటుకు సంబంధించి 2018 డిసెంబరు 31న ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేశారు. వాటిపై అభ్యంతరాలు, వినతులు స్వీకరించారు. వాటన్నింటి ఆధారంగా 11 మండలాలతో నారాయణపేట జిల్లా, 9 మండలాలతో ములుగు జిల్లా ఏర్పాటుకు ఇవాళ రెవెన్యూశాఖ తుది నోటిఫికేషన్ జారీ చేసింది. రేపట్నుంచి కొత్త జిల్లాలు ఉనికిలోకి వస్తాయి. రెండు కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఇతర అధికారులను నియమించాల్సి ఉంది.
నారాయణపేట జిల్లాలో మండలాలు: నారాయణపేట, దామరగిద్ద, మరికల్, కోస్గి, ధన్వాడ, నర్వ, మద్దూర్, ఊట్కూర్, మక్తల్, మాగనూర్, కృష్ణా.
ములుగు జిల్లాలో మండలాలు: ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, మంగపేట, వాజీడు, తాడ్వాయి(సమ్మక్క-సారక్క), ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, వెంకటాపురం