యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. శాసనసభ ప్రారంభం కాగానే పుల్వామా అమరులకు సంతాపం తెలియజేస్తూ సీఎం కేసీఆర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ నెల 14వ తేదీన జరిగిన పుల్వామా దాడిలో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం జీర్ణం కాని బాధాకరమైన దుర్ఘటన అని చెప్పారు. సైనికుల మీద, వ్యక్తుల మీద జరిగిన దాడిగా కాకుండా సమస్త దేశంపై జరిగిన దాడిగా అందరూ భావిస్తున్నారని తెలిపారు. 40 మంది జవాన్లు మృతిచెందటం బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు సానుభూతి చెప్పడమే కాదని, దేశం యావత్తు మీ వెంట ఉందని వారికి చెప్పాలని ఆయన అన్నారు ఈ రోజు తెలంగాణ ప్రజలు, రాష్ట్రం ప్రక్షాన మృతుల కుటుంబాలకు సానుభూతి తెలపడమే కాదు.. వారి అమూల్యమైన ప్రాణాలను తిరిగి తేలేకపోయిన ఒక్కొక్క అమర జవాను కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు సీఎం పేర్కొన్నారు.
కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమర్ధిస్తున్నామన్నారు. జవాన్లు దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. దేశ ఆర్థిక, రక్షణ వ్యవస్థలను దెబ్బతీసేందుకే ఉగ్రదాడులన్నారు. దేశం, రాష్ట్రం అమరజవాన్ల కుటుంబాలకు అండగా ఉంటాయన్నారు. నిఘా వ్యవస్థలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అమర జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న సాయాన్ని అభినందిస్తున్నామని భట్టి అన్నారు. వివిధ పక్షాల నేతలు మాట్లాడిన తరువాత సభ అమర వీరులకు రెండు నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించింది.