యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీని వీడి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరగా.. తాజాగా మాజీ మంత్రి డీకే అరుణ కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి, బీజేపీలో చేరారు, ఈ మేరకు బీజేపీ కీలక నేత రాంమాధవ్ మంగళవారం అరుణ నివాసానికి వెళ్లి ఆమెతో మంతనాలు జరిపినట్టు తెలిసింది. అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆమెతో ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. అనంతరం పార్టీలో చేరే విషయంపై బీజేపీ పెద్దలతో మాట్లాడేందుకు అరుణ ఢిల్లీ వెళ్లారు. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత కూడా చర్చలు కొనసాగాయి.కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉంది. మంగళవారమే అభ్యర్థుల జాబితా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల ప్రకటన వెలువడలేదు. పార్టీలోకి వచ్చే నేతలకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశం, గెలుపు గుర్రాలను బరిలో నిలపాలన్న ఆలోచనతో అభ్యర్థుల ఖరారులో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ఒక్క స్థానం మినహా మిగతా స్థానాలు ఖరారు కావడం, టీఆర్ఎస్ ఈనెల 21న అభ్యర్థులను ప్రకటించనున్న నేపథ్యంలో అప్పటివరకు వేచి చూడాలా వద్దా అని ఆ పార్టీ ఆలోచిస్తోంది. టీఆర్ఎస్లో టికెట్ దక్కనివారికి, గెలిచే అవకాశం ఉన్న నేతలకు టికెట్లు ఇవ్వడం ద్వారా ఆయా స్థానాల్లో తమ సత్తా చాటాలన్న ఆలోచనలో ఉన్న బీజేపీ అప్పటివరకు వేచి చూసే అవకాశాలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ పాలన చూసే బాపురావు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఎన్ని చెప్పినా రాష్ట్ర ప్రజలు మోదీ వైపే చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ప్రజలే గెలిపించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. బాపురావు బీజేపీలో చేరడంతో ఆయనకు ఆదిలాబాద్ లోక్సభ టికెట్ ఇచ్చే అవకాశముంది. మరోవైపు మహబూబ్నగర్ నుంచి టీఆర్ఎస్ సీనియర్ నేత జితేందర్రెడ్డి కూడా బీజేపీలో చేరతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర పార్టీ నేతలను వివరణ కోరగా ఇంకా సమయం ఉంది కదా.. అని పేర్కొన్నారు. మరిన్ని చేరికలు ఉండొచ్చని వెల్లడించారు.