తెలంగాణలో 26 మంది విద్యార్థులు మరణానికి కారణమై పెను రాజకీయ దుమారం సృష్టించిన ఇంటర్ ఫలితాల వ్యవహారంపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఫెయిలైన విద్యార్థుల రీవెరిఫికేషన్ ఫలితాలను, జవాబు పత్రాలతో పాటుగా విడుదల చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఫలితాలతో పాటు జవాబు పత్రాలను సైతం ఆన్లైన్లో పెట్టాలని బోర్డుకు స్పష్టంచేసింది.గురువారమే ఫలితాలను ప్రకటించి.. ఈ నెల 27న సమాధాన పత్రాలు అప్లోడ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇంటర్ బోర్డు తెలిపినప్పటికీ.. రెండూ ఒకేసారి చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. రీవెరిఫికేషన్లో చాలా మంది విద్యార్థులు ఉత్తీర్ణులవుతారని భావిస్తున్నామని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఫలితాల్లో గందరగోళానికి సంబంధించిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని గ్లోబరీనా సంస్థకు నోటీసులు జారీ చేసిన ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది.