YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కలకలం రేపుతున్న కోడెల ట్యాక్స్ వివాదం

 కలకలం రేపుతున్న కోడెల ట్యాక్స్ వివాదం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

మాజీ శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు సంతానం అక్రమ వసూళ్ల చిట్టా రట్టవుతోంది. తండ్రి అధికారాన్ని తోపుడుబండ్ల వ్యాపారుల నుంచి బిల్డర్లు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, విద్యాసంస్థల యజమానులు, రైల్వే, ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్ తదితర కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారంటూ అప్పట్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు సంధిస్తూ వచ్చారు. అయితే ఇప్పటివరకు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో కొనసాగడంతో ఎక్కడికక్కడ మిన్నకుండిన బాధితులు ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి రావడంతో ధైర్యంగా ఫిర్యాదులు చేస్తున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు సాక్షాత్తు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి సైతం బాధితులకు అండగా నిలుస్తామని ప్రకటించిన నేపథ్యంలో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి నిర్భయంగా తమకు జరిగిన నష్టంపై పోలీసు అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఇందులో భాగంగా నరసరావుపేట పోలీస్టేషన్‌లో ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. తాజాగా గుంటూరు అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌లో సత్తెనపల్లికి చెందిన ఓ బిల్డర్  కోడెల ట్యాక్స్ (కే ట్యాక్స్)పై ఫిర్యాదు చేశారు. అపార్ట్‌మెంట్ నిర్మాణ అనుమతి కోసం తన వద్ద బలవంతంగా రూ. 15 లక్షలు వసూలు చేశారని, ఆ డబ్బును వడ్డీతో సహా ఇప్పించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ డబ్బును 2016 జూన్ 12న చెల్లించానని, డబ్బు చెల్లించిన విషయం పురపాలక కమిషనర్‌కు తెలియజేయగా ఆయన అపార్ట్‌మెంట్ నిర్మాణానికి అనుమతి ఇచ్చారని ఫిర్యాదులో తెలిపారు. తన నుంచి దౌర్జన్యంగా వసూలు చేసిన రూ. 15 లక్షల నగదు వడ్డీతో సహా వెనక్కి ఇప్పించాలని కోడెల శివరామ్, అతని పీఏలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఇలాఉంటే ప్రభుత్వం నుండి తనకు రావాల్సిన చెక్‌ను కోడెల శివరామ్ తీసుకెళ్లి డబ్బు డిమాండ్ చేశారని సత్తెనపల్లి ప్టటణంలోని వడ్డవల్లికి చెందిన టీడీపీ నేత శ్రీలక్ష్మీతులసి ఏజెన్సీస్ నిర్వాహకుడు యెల్లినేడి శ్రీనివాస్  పోలీసుల వద్ద మొరపెట్టుకొన్నారు. ఆయన సత్తెనపల్లి డీఎస్పీ వీ కాలేషావలిని కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తన వద్ద రూ. 5లక్షలు తీసుకున్న కోడెల శివరామ్, ఆయన పీఏలను అరెస్టు చేసి తనకు న్యాయం చేయాలని యెల్లినేడి శ్రీనివాస్  కోరారు. అయితే దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసుల తెలిపారు. సివిల్ మ్యాటర్ అయినందున తమ పరిధి కాదని డీఎస్పీ కాలేషావలి చెప్పారని బాధితుడు శ్రీనివాస్ వాపోయాడు. అలాగే నర్సరావుపేట రూరల్ పోలీసుస్టేషన్‌లో కోడెల కుమార్తె విజయలక్ష్మిపై భూకబ్జా కేసులో మరో ఫిర్యాదు అందింది. కేసానుపల్లి సర్వే నెంబర్ 145/బి3, ఎకరం భూమిపై 15 లక్షలు డిమాండ్ చేసి 12.50 లక్షల రూపాయలు ఇచ్చినప్పటికీ మిగిలిన 2.5 లక్షలు ఇవ్వాలని విజయలక్ష్మి అనుచరులు తనపై దౌర్జన్యం చేశారని జెల్లీ విజయప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మున్సిపాలిటీలో ఉద్యోగం ఇప్పిస్తానని కోడెల కుమార్తె విజయలక్ష్మి 7 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారని నర్సరావుపేట-2 టౌన్ పోలీసుస్టేషన్‌లో ఆళ్ల శేఖర్ అనే బాధితుడు ఫిర్యాదు చేశారు

Related Posts