యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తెలంగాణ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని, నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం వెంకటపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని, పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయని, కార్పొరేట్ చదువులకు దీటైన బోధన కోసం విద్యా రంగానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్లోనూ అధిక నిధులను సీఎం కేసీఆర్ కేటాయిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యంతో భోజనం, ఏటా రెండు జతల స్కూల్ యూనిఫాంలు, ఉచిత పాఠ్యపుస్తకాలు,యుక్త వయస్సు వచ్చిన బాలికలకు హెల్త్ కిట్లను అందిస్తూ గొప్ప మార్పునకు టీఆర్ఎస్ సర్కార్ శ్రీకారం చుట్టిందన్నారు. ఉన్నతమైన విద్యకావాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులను, బడిఈడు పిల్లలను బడిలో చేర్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన గుర్తుచేశారు. పుస్తకాల్లో ఉండే సబ్జెక్టులే కాకుండా పరిసరాల పరిశుభ్రత, హరితహారం వంటి ఇతర కార్యక్రమాలపై అభ్యాసం చేయించాలని సూచించారు..