యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వీధికుక్కల సమస్యను తగ్గించడంతో పాటు నగరంలో నిర్వహిస్తున్న ఆధునిక జంతు వధశాలల పర్యవేక్షణకు 30మంది వెటర్నరీ డాక్టర్లను నియమించడంతో పాటు ప్రస్తుతం వీధికుక్కలకు నిర్వహిస్తున్న సంతాన నిరోధక ఆపరేషన్లకు చెల్లించే పారితోషకాన్ని వంద నుండి రెండు వందల రూపాయలకు పెంచనున్నట్టు నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రకటించారు. నేడు మేయర్ కార్యాలయంలో నగరంలోని స్లాటర్ హౌజ్ల నిర్వహణ, భవన నిర్మాణ వ్యర్థాల ప్లాంట్ల నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్, ఇ.పి.టి.ఆర్.ఐ డైరెక్టర్ కల్యాణ్ చక్రవర్తి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, అడిషనల్ కమిషనర్ శృతిఓజా, చీఫ్ ఇంజనీర్ సురేష్, రాంకి సంస్థ ప్రతినిధి గౌతమ్ రెడ్డి తదితర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో కోట్లాది రూపాయల వ్యయంతో అత్యాధునిక పరిజ్ఞానంతో జంతు వధశాలలను నిర్మించడం జరిగిందని, అయితే వెటర్నరీ డాక్టర్లు, సిబ్బంది కొరతతో వీటిపై పర్యవేక్షణ సక్రమంగాలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఒక వీధికుక్కకు సంతాన నిరోధక ఆపరేషన్ చేసినట్టైతే కేవలం వంద రూపాయలు మాత్రమే పారితోషికాన్ని చెల్లించడం జరుగుతుందని, ఇతర నగరాలు, కార్పొరేషన్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ అని పేర్కొన్నారు. ఇతర కార్పొరేషన్లతో పోల్చి చూసిన అనంతరం నగరంలో ఈ పారితోషికాన్ని రూ. 200లకు పెంచాలని నిర్ణయించామని తెలిపారు. ఈ రెండు ప్రతిపాదనలను రానున్న స్టాండింగ్ కమిటిలో ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని మేయర్ సూచించారు. జియాగూడ స్లాటర్ హౌజ్ స్థానంలో దేశంలోనే అత్యాధునిక పరిజ్ఞానంతో స్లాటర్ హౌజ్ను నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయని, ఈ విషయంలో తగు కార్యాచరణ రూపొందించడానికి ఇ.పి.టి.ఆర్.ఐ కి అప్పగిస్తున్నట్టు మేయర్ తెలిపారు. నగరంలో 105 బ్లాకుల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, ఈ బ్లాకుల్లో తగు భద్రత చర్యలను చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని మేయర్ ఆదేశించారు. జూలై మాసంలో జీడిమెట్ల భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ను ప్రారంభించడం జరుగుతుందని, ఇదేరోజు ఫతుల్లాగూడలో నూతన సి అండ్ డి ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టనున్నట్టు రామ్మోహన్ వివరించారు.