యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కొద్దిసేపటి క్రితం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ కేసులో ఆయన ‘ఏ1’ నిందితుడిగా ఉన్నారు. ఇదిలా ఉండగా, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున రాజోలుకు చేరుకుంటున్నారు. దీంతో, రాజోలు పోలీస్ స్టేషన్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కాగా, మలికిపురంలో పేకాడుతున్న 9 మందిని స్థానిక ఎస్సై నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారిని విడిచి పెట్టాలని రాపాక, అతని అనుచరులు ఎస్సైతో ఘర్షణ పడ్డారు. పోలీస్ స్టేషన్ పై రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలో రాపాక, ఆయన అనుచరులపై పోలీస్ కేసు నమోదైంది. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రజల తరఫున పోలీస్ స్టేషన్ కు వెళ్లిన రాపాకపై కేసులు పెట్టడం సరికాదని వ్యాఖ్యానించారు. ప్రజలు కోరిన మీదటే వారికి మద్దతుగా రాపాక స్టేషన్ కు వెళ్లారని, అంతమాత్రానికే కేసులు పెట్టడం అన్యాయని అన్నారు. నెల్లూరులో ఓ జర్నలిస్టుపై వైసీపీ ఎమ్మెల్యే దాడి చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పుడు మలికిపురం ఘటనలో గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చారని విమర్శించారు. ఈ ఘటన శాంతిభద్రతల సమస్యగా మారకుండా అధికారులు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. జనసేన కార్యకర్తలు, నేతలు సంయమనంతో వ్యవహరించాలని పవన్ సూచించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే మాత్రం తాను రంగంలోకి దిగుతానని జనసేనాని స్పష్టం చేశారు. మలికిపురం ఘటనపై ఎప్పటికప్పుడు పార్టీ నేతలతో సమీక్షిస్తున్నానని వివరించారు