న్యూఢిల్లీలో రహదారుల నిర్వహణ విధానంపై అద్యయనం చేసిన బల్దియా ఇంజనీర్లు
హైదరాబాద్ నవంబర్ 16
దేశ రాజధాని న్యూఢిల్లీలో రహదారుల నిర్వహణ, ఫుట్ పాత్ ల నిర్మాణం, సబ్-వేలు, బస్-బేల నిర్వహణ, రోడ్ కట్టింగ్ లో పాటించే నియమ నిబంధనలు, కాలనీ రోడ్ల నిర్వహణ తదితర అంశాలపై అద్యయనం చేయడానికి జిహెచ్ ఎంసి చీఫ్ ఇంజనీర్లు జియాఉద్దీన్, ఆర్.శ్రీధర్లతో కూడిన ఇంజనీర్ల బృందం పర్యటిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లో రహదారుల నిర్వహణతో పాటు మౌలిక సదుపాయాల కల్పనను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకుగాను దేశంలోని ఇతర నగరాల్లో ఉన్న ఉత్తమ విధానాలను అద్యయనం చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ఆదేశించిన నేపథ్యంలో జిహెచ్ఎంసి ఇంజనీర్ల బృందం న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో శనివారం పర్యటించారు. న్యూఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తో కలిసి ఎన్.డి.ఎం.సి చీఫ్ ఇంజనీర్ సంజయ్గుప్త, సూపరింటెండెంట్ ఇంజనీర్ హెచ్.పి.సింగ్, ఇఇ ఎన్.కె గోయల్, ఇతర అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో రహదారుల నిర్వహణకు ఉపయోగించే సాంకేతిక విధానం, సామాగ్రి, వాహనాలు, బి.టి మెటీరియల్ తో పాటు సబ్-వే, బస్-బే ల నిర్మాణం, నిర్వహణ, వివిధ విభాగాల అవసరార్థం చేపట్టే రోడ్డు కట్టింగ్లకు అనుసరిస్తున్న విధానాలను ఈ ఇంజనీర్ల బృందం పరిశీలించింది. జిహెచ్ఎంసిలో 709 కిలోమీటర్ల ప్రధాన రహదారులను వార్షిక నిర్వహణ క్రింద ఏజెన్సీలకు కేటాయిస్తున్న నేపథ్యంలో న్యూఢిల్లీలో రోడ్ల నిర్వహణలో పాటిస్తున్న విధానాలను తెలుసుకున్నారు.వీటితో పాటు కాలనీ రోడ్ల నిర్వహణ, ఫుట్ పాత్ల నిర్వహణ, ప్లబిక్ టాయిలెట్ల నిర్మాణం, ఓపెన్ జిమ్ ల ఏర్పాటు, డ్రెయిన్ల నిర్మాణం, కమ్యునికేషన్ కేబుళ్లకు ప్రత్యేక డక్ట్ల నిర్మాణం, ఎవెన్యూ ప్లాంటేషన్ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఇంజనీరింగ్ నిర్వహణ విభాగం ద్వారా చేపడుతున్న పనులు, వాటిలో ఉపయోగించే సాంకేతికపరమైన అంశాలు, శానిటేషన్, సీవరేజ్ క్లీనింగ్ లో చేపట్టిన ఆధునిక విధానాలను న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు జిహెచ్ఎంసి ఇంజనీర్లు వివరించారు. ఈ సమావేశంలో జిహెచ్ఎంసి సూపరింటెండెంట్ ఇంజనీర్లు ఆర్.శంకర్లాల్, టి.రవీంద్రనాథ్, పి.అనీల్రాజ్ లు పాల్గొన్నారు.