అదిరిన ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీల రోడ్షో
దారికిఇరువైపులా ప్రజలు తిరంగా జెండాలు
సంప్రదాయ నృత్యాలతో, వస్త్రధారణతో స్వాగతం
సోషల్ మీడియాలో మాత్రం తీవ్ర వ్యతిరేకత
గాంధీ చరఖాపై నూలు వడికిన ట్రంప్
అహ్మదాబాద్ ఫిబ్రవరి 24
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ రోడ్షో ప్రారంభమైంది. ట్రంప్ కాన్వాయ్ ముందు తెల్లని రంగు లో ఉన్న ఇన్నోవా వాహనాలు ముందు నడుస్తుండగా, వాటి వెనకాల నల్లటి రంగులో ఉన్న ట్రంప్ కాన్వాయ్ వాహన శ్రేణి వాటిని అనుసరిస్తోంది. దారికి ఇరువైపులా అహ్మదాబాద్ ప్రజలు తిరంగా జెండాలతో, సంప్రదాయ నృత్యాలతో, వస్త్రధారణతో ట్రంప్కు ఘన స్వాగతం పలుకుతున్నారు. రహదారులకు ఇరువైపులా ‘నమస్తే ట్రంప్’ అన్న నినాదాలతో ప్రజలు నినాదాలను హోరెక్కిస్తున్నారు. మరోవైపు ఆయా రహదారుల కూడల్లో గానీ, రోడ్డుకిరువైపులా ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ కటౌట్లు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఈ రోడ్ షో 22 కిలోమీటర్లు సాగుతుంది. మొట్టమొదటగా ట్రంప్ సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. సబర్మతి ఒడ్డున ఉన్న ఈ ఆశ్రమాన్ని ప్రధాని మోదీతో కలిసి ట్రంప్ సందర్శించారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆశ్రమం వరకు వీరికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. ట్రంప్ దంపతులకు శాలువా కప్పిన మోదీ ఆశ్రమం విశేషాలను వివరించారు. ఆశ్రమంలోని గాంధీ చిత్రపటానికి ట్రంప్ నూలు దండ వేసి నివాళులర్పించారు. ట్రంప్ తన షూస్ విప్పి మాత్రమే ఆశ్రమం లోపలికి వెళ్లడం విశేషం. ఇప్పటి వరకు అనేక మంది అమెరికా అధ్యక్షులు భారత్లో పర్యటించినప్పటికీ, సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన తొలి అధ్యక్షునిగా ట్రంప్ నిలిచారు. ఈ ఆశ్రమం లోపల ఉండే హృదయ్కుంజ్లో ఏర్పాటు చేసిన చరఖాపై ట్రంప్ నూలు వడుకుతుండగా మెలానియా ఆసక్తిగా తిలకించారు. సుమారు 30 నిమిషాల పాటు ట్రంప్ ఆయన భార్య మెలానియా, ప్రధాని మోదీ ఈ ఆశ్రమంలో గడిపారు. సందర్శకుల పుస్తకంలో ట్రంప్ సందేశాన్ని రాసి.. సంతకం పెట్టారు. ట్రంప్ కోసం కేంద్రం గుజరాత్ సర్కారు భారీగా ఖర్చు చేస్తోంది. మోడీ ఇజ్జత్ కా సవాల్ గా ఖర్చును భారీగా పెడుతున్నారట.. ట్రంప్ టూర్ కోసం గుజరాత్ సర్కారు ఏకంగా 100 కోట్లు ఖర్చు చేస్తోంది. కేవలం 3 గంటల ఈ పర్యటనకు 100 కోట్లు అంటే మాటలు కాదు కదా.. దాదాపు నిమిషానికి రూ.55 లక్షలు ఖర్చు చేస్తోందన్నమాట.. అంటే గుజరాత్ బడ్జెట్ లో ఈ మొత్తం ఏకంగా 1.5 శాతం.ట్రంప్ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా.. ఖర్చు విషయంలో వెనుకాడవద్దని ప్రధాని మోడీ గుజరాత్ సర్కారు ను ఆదేశించారు. అహ్మదాబాద్ నగరం ముస్తాబైంది. రోడ్లు తళతళ మెరుస్తున్నాయి. గోడలకు పెయింటింగ్స్ ట్రంప్ వెళ్లే మార్గంలో అద్దంలా తయారు చేశారు. రోడ్ల కోసమే 60 కోట్లు ఖర్చు చేశారు. కాగాభారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ట్విట్టర్ షాకిచ్చింది. ఎన్నో ఆశలతో భారత్ కు వచ్చిన ట్రంప్ కు అహ్మదాబాద్ లో ఘన స్వాగతం లభించింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ట్విటర్ లో ట్రంప్ పర్యటనను వ్యతిరేకిస్తూ ట్వీట్లు భారీగా వచ్చాయి. గో బ్యాక్ ట్రంప్ అనే హ్యాష్ ట్యాగ్ తో అత్యధికంగా ట్వీట్లు నమోదయ్యాయి. నంబర్ వన్ స్థానంలో గో బ్యాక్ ట్రంప్ అనేది ట్రెండింగ్ అవుతోంది. భారత పర్యటనను ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే అమెరికాలో మానవ హక్కులు కాలరాస్తున్నాడని అణుయుద్ధానికి తెరలేపుతున్న వ్యక్తి ట్రంప్ అని పేర్కొంటున్నారు. నమస్తే ఇండియా వేరు.. నమస్తే ట్రంప్ వేరు అని చెబుతున్నారు. అయితే ట్రంప్ పర్యటన సందర్భంగా ప్రభుత్వం చేసిన నానా హడావుడిని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ సందర్భం గా ఒకరు చేసిన ట్వీట్ విశేషంగా ఆకట్టుకుంది.ట్రంప్ పర్యటన సందర్భంగా చిన్నారులమైన మేం ఐదు గంటలుగా నిరీక్షిస్తున్నామని ఆవేదన చెబుతూ ఓ బాలిక ఫొటో ఉన్న ట్వీట్ ఆవేదనకు గురి చేసింది. ఈ విధంగా ట్రంప్ పర్యటన సందర్భంగా అహ్మదాబాద్ లో ప్రజా జీవనం స్తంభించింది. అప్రకటిత సెలవు కొనసాగింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అందుకే గో బ్యాక్ ట్రంప్ ట్వీట్ వైరలవుతోంది.