మహనాడు తర్వాత చినబాబు టీమ్
గుంటూరు, మే 23,
టీడీపీలో యువ నాయకత్వానికి పెద్ద పీట పడుతుందా ? గతంలో ఎన్నడూ లేని విధంగా యువ నాయకత్వానికి, యవత ఆత్మ గౌరవానికి ప్రాధాన్యం లభిస్తుందా ? అంటే.. ఔననే అంటున్నారు టీడీపీ సీనియర్లు. వాస్తవానికి గత ఏడాది ఎన్నికల్లోనే యువతకు ప్రాధాన్యం ఇచ్చారు. అనంతపురం సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా వరకు నియోజకవర్గాల్లో యువతకు టికెట్లు ఇచ్చారు. వీరంతా 35 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. అయితే, వీరంతా ఏదో ఒక రకంగా రాజకీయంగా వారసత్వం పుణికిపుచ్చుకున్నవారే కావడంతో ఒంటరిగా ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన యువతరం ఒకింత నొచ్చుకుంది.మేం జెండాలు మోసేందుకు.. వారు పదవులు వెలగబెట్టేందుకు! అనే కామెంట్లు జోరందుకున్నాయి. దీంతో చాలా నియోజకవర్గాల్లో ఎలాంటి రాజకీయ వారసత్వం లేని యువత ఎన్నికల్లో సహకరించలేదనే వ్యాఖ్యలు ఉన్నాయి. పైగా జగన్ సునామీ పెద్ద ఎత్తున టీడీపీపై తీవ్ర ప్రభావం చూపించింది. దీనికి తోడు చంద్రబాబు తన తనయుడు లోకేష్కు పార్టీ పగ్గాలు అప్పగించాలని ప్రయత్నించారు. నిజానికి గత ఎన్నికల్లో టీడీపీ గెలిచి ఉంటే.. ఇప్పటికే సదరు పట్టాభిషేకం అయిపోయి ఉండేదనే టాక్ కూడా ఉంది. కానీ,అనూహ్యంగా పార్టీ ఓటమి చెందడంతో బాబు మౌనం వహించారు. ఒకవైపు చంద్రబాబుకు వయసు మీరుతుండడం వారే 80 ఏళ్లు వచ్చినా.. రాజకీయాల్లో ఉన్నారు చంద్రబాబుకు ఏం ఢోకాలేదు.. అనేవారు ఉన్నారు. నిజమే అలా ఉండాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కానీ, ఆయా పార్టీలకు టీడీపీకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. పైగా టీడీపీలో నందమూరి కుటుంబం ప్రాధాన్యం తగ్గుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ మిగిలిన వారసులను చంద్రబాబు ఎప్పుడో సైడ్ చేసేశారు. ఇక హరికృష్ణ కెరీర్ చివర్లో ఎలా ముగిసిందో అందరికి తెలిసిందే. ఆ తర్వాత కూడా చంద్రబాబు తన అవసరాల కోసమే ఆయన కుటుంబాన్ని వాడుకున్నట్టే ఉంది. ఇక ఇటు ఎన్టీఆర్తోనూ చంద్రబాబుకు సఖ్యత లేదు.ఈ నేపథ్యంలో తాను ఆరోగ్యంగా ఉన్నసమయంలోనే పార్టీని తన కుమారుడికి అప్పగించాలనేది చంద్రబాబు వ్యూహం . సో.. ఇవన్నీ సఫలీకృతం అవ్వాలంటే.. త్వరలోనే లోకేష్ను కీలక స్థానంలో నిలబెట్టాల్సి ఉంటుందనేది చంద్రబాబు ఆలోచన. ఈ క్రమంలోనే వారసత్వంతో పాటు.. సాధారణ యువతరానికి కూడా పదవులు ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల చివరిలో నిర్వహించనున్న మహానాడులో యువత కు ప్రత్యేకంగా పదవులు ఇస్తారని అంటున్నారు. దీంతో టీడీపీ ఇకపై.. యువ తెలుగుదేశం కానుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి