YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

దానగుణం

దానగుణం

లోకంలో ధనానికి మూడు గతులున్నాయి. అవి దానం, భోగం, నాశనం. దానం చెయ్యకుండా, తాను అనుభవించకుండా కూడబెట్టిన ధనం చోరులపాలో, రాజుపాలో అవుతుందని సుభాషితం. ‘దానమీనివాడు ధన్యుండుగాడయా’ అన్నాడు వేమన. దానంవల్ల పుణ్యం సిద్ధిస్తుంది. కీర్తి నిలుస్తుంది. ఎన్నో రాజ్యాలుండేవి. ఎందరో రాజులు పాలించారు. వారెవరూ సిరిమూటగట్టుకొని పోలేదు. గొప్పదాతలైనవారే యశఃకాయులయ్యారు. శిబి చక్రవర్తిని, బలి చక్రవర్తిని లోకం మరచిపోలేదు. కర్ణుడు అధర్మపక్షంలో ఉన్నా దానకర్ణుడుగా ప్రసిద్ధుడు. భూమికి పర్వతాలు, సముద్రాలు భారం కాదు. దానగుణం లేనివారే భారమవుతున్నారు అంటాడు శ్రీనాథుడు.  శాస్త్రాల్లో అనేకరకాల దానాలు చెప్పారు. అయితే ఆధునికయుగంలో సమయ దానమూ గొప్పదే. కాలం చాలా విలువైనది. దాన్ని ఆపలేం. గతించిన కాలం   వెనక్కిరాదు. సమాజసేవ కోసం, సత్కార్యాల కోసం మన దైనందిన సమయంలో కొంత కేటాయించడం ఉత్తమ సంస్కారం.  కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో యజ్ఞం, ద్వాపరయుగంలో దానం, కలియుగంలో ధ్యానం యుగధర్మాలుగా పేర్కొన్నారు. అయితే దానం అన్ని కాలాల్లోనూ ఉత్తమమే. పూర్వులు వదిలివెళ్లిన ధనంతో కొంతభాగాన్ని వారి ఆత్మకల్యాణం కోసం దానం చెయ్యాలి. అదే నిజమైన శ్రాద్ధం. జలతర్పణం, పిండదానం కేవలం ప్రీతిదాత్మకం. నిజమైన శ్రద్ధ పూర్వుల సంపదను వారి సద్గతుల కోసం సత్కర్మల కోసం దానం రూపంలో సమాజానికి ఇచ్చివేయడంలోనే ఉంది. ఎవరైనా లోభమోహాలకు వశులై తమ సంపదను సదుపయోగం చేసి ఉండకపోతే ఆ లోపాన్ని వారి వారసులు పూరించాలి.  దురాశతో, స్వార్థంతో కోట్ల ఆస్తుల్ని కూడబెట్టి వారసులకిస్తే- వారు బాధ్యతారహితులు, సోమరులు, అహంకారులు అవుతారు. పాపపుణ్యాలన్నీ ఇచ్చిపుచ్చుకోవడంలోనే ఉంటాయి.  అయితే దానానికీ కొన్ని నియమాలు ఏర్పరచారు మన పూర్వులు. పాత్రత ఎరిగి దానం చెయ్యమన్నారు. మంచినేలలో నాటిన గింజలు ఫలించి సస్యాలవుతాయి. చవిటి నేలలో వేసిన బీజాలు నశిస్తాయి. అపాత్రదానం గాని, స్థోమతకు మించిన దానాలుకాని చేయకూడదు. పాత్రత అంటే యోగ్యత. ఇది మూడు విధాలు. ధర్మపాత్రం, కార్యపాత్రం, కామపాత్రం. ధర్మజ్ఞుడైనవాడికి చేసే దానం ఉత్తమం. దానగ్రహీత స్వీకరించినదాన్ని ధర్మకార్యాలకే వెచ్చిస్తాడు. కార్యపాత్రమంటే తగినపని. మంచిపనులకు అంటే ఒక దేవాలయం, విద్యాలయం, శరణాలయం వంటివాటి ఏర్పాటుకు దానంచెయ్యడం. మూడోది కామపాత్రం. కామమంటే కోరిక. యాచకుడు పేదరికంతో తన మనుగడకోసం బతుకుతెరువుకోసం అన్నమో, ధనమో, వస్త్రమో, భూములో కోరతాడు. వాడి స్థితినిబట్టి, అవసరాన్నిబట్టి యోగ్యత నిర్ణయించాలి.  అన్యాయార్జితమైన విత్తాన్ని దానం చెయ్యడంవల్ల ఫలంలేదు. ధర్మంగా కష్టించి సంపాదించినదాంట్లో కొంచెమైనా సమాజక్షేమానికి వ్యయంచేయడం మేలైన పని. ‘తక్కువ తీసుకో. ఎక్కువ ఇచ్చుకో’ అని సామెత. ఆకలిదప్పులతో ఉండి కూడా తనకు లభించిన అన్నాన్ని, జలాన్ని అర్థికి ఇచ్చివేసిన రంతిదేవుడి గాథ-  
భాగవతంలో ప్రసిద్ధఘట్టం. మూడడుగుల నేల దానం ఇవ్వడంవల్ల నాశనమవుతావని గురువు శుక్రాచార్యుడు చెప్పినా వినని సత్యసంధుడు బలిచక్రవర్తి దానగుణం- సర్వకాలాలకూ ఆదర్శం.  నిండిపోయిన చెరువులో నీటిని రక్షించాలంటే దాన్ని కొంత బయటకు వదిలివేయడమే తప్ప మరో మార్గం లేదు. ‘ఇది నా భూమి’ అనేవాణ్ని చూసి భూదేవి నవ్వుతుంది. తాను అనుభవించక, చేయదగిన దానాలు చెయ్యనివాణ్నిచూసి ధనం నవ్వుతుంది. దానశీలిని లోభమోహాలు దరిచేరవు. దానం గుప్తంగా ఉండాలి. ప్రచారం కోసం, కీర్తికోసం అయోగ్యులకు, అనుచిత కార్యాలకు దానం చెయ్యడాన్ని అర్థదూషణమంటారు. అర్థదూషకుడు కుబేరతుల్యుడైనా చివరికి భిక్షమెత్తుకోవలసి వస్తుందని శాస్త్రవచనం. ‘సొంతలాభం కొంతమానుకో పొరుగువాడికి తోడుపడటం’ నేటి సూక్తి.

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts