న్యూఢిల్లీ జూలై8
గాంధీ కుటుంబానికి సంబంధించిన మూడు ట్రస్టులపై దర్యాప్తు జరిపించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఆ మూడు ట్రస్టుల్లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అవకతవకలు జరిగాయని, అందుకే వాటిపై దర్యాప్తు చేయించబోతున్నామని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. రాజీవ్గాంధీ ఫౌండేషన్, రాజీవ్గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్లలో ఆదాయపన్ను చెల్లింపు, విదేశీ విరాళాలకు సంబంధించి నియమాల ఉల్లంఘన జరిగిందని, ఈ అన్నింటిపై జరిగే విచారణలను సమన్వయం చేయడం కోసం కేంద్రహోంశాఖ ఇంటర్-మినిస్టీరియల్ కమిటీని ఏర్పాటు చేసిందని హోంశాఖ అధికార ప్రతినిధి ఈ ఉదయం ట్వీట్ చేశారు. గాంధీ కుటుంబ ట్రస్టులు ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ), ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్లను ఉల్లంఘించాయని, వీటిపైనే ప్రధానంగా దర్యాప్తు జరుగుతుందని హోంశాఖ తెలిపింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేక డైరెక్టర్ ఇంటర్ మినిస్టీరియల్ కమిటీకి నేతృత్వం వహిస్తారని హోంశాఖ తెలిపింది. కాగా, యూపీఏ హయాంలో మన్మోహన్ ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రాజీవ్గాంధీ ఫౌండేషన్కు విరాళం ఇచ్చిందని బీజేపీ ఆరోపించింది.