వరంగల్ జూలై 9
టిఎస్ ఆర్టీసిలో పనిచేస్తున్న అద్దె బస్ డ్రైవర్లను ఆదుకోవాలని టీఆర్ఎస్కెవి వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు కోరారు. ఈ మేరకు గురువారం తెలంగాణ హెయిర్ బస్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ (టీఆర్ఎస్కెవి అనుబంధ సంఘం) ఆధ్వర్యంలో అద్దె బస్సుల యజమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగిశెట్టి ప్రసాద్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి మూలంగా ఒక్కో డ్రైవర్ కు నెలలో ఆరు లేదా ఏడు డ్యూటీల కంటే మించి లేకపోవడం వల్ల నెలకు రెండు నుండి మూడు వేల రూపాయలకు మించి వేతనం రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీ చాలని జీతంతో కుటుంబ పోషణ భారమై కార్మిక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. ప్రస్తుత నెల నుండి ప్రతీ డ్రైవర్ కు నెలకు పదివేల రూపాయలు లేదా ఒక డ్రైవర్ నెల జీతం మొత్తం ఇద్దరికి సగం సగం పంచాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన యాజమాన్యం తమ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపినట్లు గోనె యువరాజు పేర్కొన్నారు.