YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

దుబ్బాక ఏకగ్రీవం అవుతుందా

దుబ్బాక ఏకగ్రీవం అవుతుందా

మెదక్, ఆగస్టు 8, 
తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతోంది. సిద్ధిపేట జిల్లా దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మృతితో అక్కడ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కేంద్ర ఎన్నిక సంఘానికి నివేదిక పంపిన అనంతరం ఇక్కడ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రానుంది. సీనియర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత రామలింగారెడ్డి స్థానంలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై టీఆర్ఎస్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
దుబ్బాక నియోజకవర్గానికి చెందిన ఆయన.. నాలుగు సార్లు శాసనసభ్యుడిగా గెలుస్తూ వచ్చారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడుగా మెలిగారు. రామలింగారెడ్డికి కేసీయార్ కి మధ్య ఎంతో అనుబంధం ఉంది. 2001లో మలిదశ తెలంగాణ ఉద్యమంలో రామలింగారెడ్డి కీలకపాత్ర పోషించారు. కేసీఆర్‌ 2001లో టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించినప్పటి నుంచి ఆయన జర్నలిస్టుగా ఉంటూనే పలు కథనాలు రాసి ఉద్యమ బలోపేతానికి కృషి చేశారు. కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేసే క్రమంలో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లినపుడు రామలింగారెడ్డి వెన్నంటి ఉండి ఆయన గెలుపులో ముఖ్యపాత్ర పోషించారు.
అప్పటి నుంచి రామలింగారెడ్డి కేసీఆర్‌కు బాగా దగ్గరయ్యారు. కేసీఆర్‌ రామలింగారెడ్డిని పిలిచి 2004లో టీఆర్‌ఎస్‌ తరపున దొమ్మాట నియోజకవర్గం టికెట్‌ ఇచ్చా రు. ఆ ఎన్నికల్లో రామలింగారెడ్డి గెలవడం ద్వారా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. 2008 ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిచిన ఆయన 2009లో ఓటమిపాలయ్యారు. మళ్లీ 2014, 2018 ఎన్నికల్లో గెలుపొందారు.తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమం లో భాగంగా రామలింగారెడ్డిపై 30కిపైగా పోలీస్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ ఏర్పడ్డాక కూడా రామలింగారెడ్డికి దుబ్బాక సీటిచ్చారు. మరి రామలింగారెడ్డి భార్య సుజాతకు సీటిచ్చి కేసీయార్ తన చాణక్యంతో  ఏకగ్రీవం చేస్తారేమో చూడాలి. ఆయన మృతిపట్ల సంతాపం తెలపడంతో పాటు.. సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు, ఇతర పార్టీల నేతలు కూడా నివాళులర్పించారు.రామలింగారెడ్డి పార్ధివ దేహానికి అంత్యక్రియలు జరిపే సమయంలో మంత్రి హరీష్ రావు స్వయంగా పాడె మోశారు. రామలింగారెడ్డితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. రామలింగారెడ్డి మరణం పట్ల తీవ్ర సంతాపం ప్రకటించిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒక ప్రతిపాదన తెరమీదకు తెచ్చారు. దుబ్బాక ఉప ఎన్నికలో రామలింగారెడ్డి భార్యకే టికెట్ ఇవ్వాలని కోరారు. ఆయన భార్యకు టికెట్ ఇస్తేనే రామలింగారెడ్డికి నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందన్నారు. రామలింగారెడ్డి భార్యకు టికెట్ ఇస్తే.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో తాను మాట్లాడుతానన్నారు జగ్గారెడ్డి. అంతేకాదు తమ పార్టీ సీనియర్ నేతలు మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ, మాజీ మంత్రి గీతారెడ్డితో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తానని అన్నారు.దుబ్బాకలో  ఆయన భార్యను టీఆర్ఎస్ తరపున ఎంపిక చేస్తే పోటీకి రాబోమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెబుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో చూడాలి

Related Posts