హైద్రాబాద్,నవంబర్ 20
జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో జనసేన పార్టీ రివర్స్ గేర్ తీసుకుంది. ఇప్పటి వరకూ బల్దియా ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన పవన్ కల్యాణ్ తాజాగా పోటీ చేయడం లేదని ప్రకటించారు. జన సైనికులు బీజేపీకి పూర్తి మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ నివాసంలో బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, డాక్టర్ కె.లక్ష్మణ్తో భేటీ అయి పవన్ జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చించారు. అనంతరం ఈ నిర్ణయాన్ని వెలువరించారు. ఓట్లు చీలకుండానే ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2014లో బీజేపీతో కలిసి పని చేసిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా, కార్యకర్తలకు ఇష్టం లేకపోయినా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. జనసైనికులు కాస్త నిరుత్సాహానికి గురైనా, ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ నగర రక్షణ కోసం బీజేపీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. దుబ్బాక ఎన్నికల తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చిద్దామనుకున్నామని.. కానీ అంతలోనే ఎన్నికలు రావడం వల్ల సమయం కుదరలేదని అన్నారు.నగరంలో బలమైన వ్యవస్థ ఉండాలని, బీజేపీ గెలవాలన్న ముఖ్య ఉద్దేశంతో ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. నిరుత్సాహపడొద్దని జనసైనికులకు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా రోడ్ మ్యాప్ రూపొందించుకుంటామని అన్నారు. నవంబర్ 19న కూడా 27 మందితో కూడిన జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను రిలీజ్ చేస్తామంటూ ఆ పార్టీ అధికారిక ట్విటర్ ఖాతాలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అనూహ్యమైన ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.