YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సోషల్ ఇంజనీరింగ్ లో అఖిలేష్

సోషల్ ఇంజనీరింగ్ లో అఖిలేష్

లక్నో, నవంబర్ 23, 
మరో రెండేళ్లలో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ లో పూర్తి స్థాయిలో ఆత్మవిశ్వాసం ఏర్పడింది. బీహార్ లో తేజస్వి యాదవ్ ఎన్డీఏకు చుక్కలు చూపించారు. స్వల్ప సీట్ల తేడాతోనే సీఎం పదవిని ఆయన చేజార్చుకున్నారు. బీహార్ లో కుల సమీకరణాలతో పాటు, ప్రభుత్వంపై అసంతృప్తి కూడా తేజస్వి యాదవ్ కు ఆ స్థాయిలో ఓట్లు రావడానికి కారణంగా అఖిలేష్ యాదవ్ భావిస్తున్నారు.అందుకే అఖిలేష్ యాదవ్ ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో కూడా బీహార్ లాగానే కులా సమీకరణాలతోనే రాజకీయాలు నడుస్తాయి. బీహార్ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ కాంగ్రెస్ ను కలుపుకుని వెళ్లి తప్పుచేశారని అఖిలేష్ యాదవ్ భావిస్తున్నారు. కాంగ్రెస్ కారణంగానే తేజస్వి యాదవ్ అధికారంలోకి రాలేకపోయారని అఖిలేష్ సీనియర్ నేతల ముందు తన అభిప్రాయాన్ని వెల్లడించారు.గత లోక్ సభ ఎన్నికల్లోనే అ‌ఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ ను దూరంగా పెట్టారు. బీఎస్పీ తో చేతులు కలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసి పోటీ చేసి చేదుఅనుభవాన్ని అఖిలేష్ యాదవ్ చవి చూశారు. ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికల ఫలితాలు ఉత్తర్ ప్రదేశ్ లోనూ కాంగ్రెస్ ను అన్ని పార్టీలూ దూరం పెట్టేలా ఉన్నాయి. అఖిలేష్ యాదవ్ అయితే దీనిపై స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు.అంతేకాదు.. పెద్ద పార్టీలతో కూడా తాము కూటమిగా ఏర్పడేది లేదని చెప్పారు. బీఎస్పీ వంటి పార్టీలకూ ఆయన దూరంగా ఉండనున్నారు. చిన్న చిన్న పార్టీలతో అఖిలేష్ యాదవ్ కూటమి కట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. కుల,మత పరమైన పార్టీలతోనే అఖిలేష్ యాదవ్ కలసి నడిచే అవకాశాలున్నాయి. దీంతో పాటు అఖిలేష్ యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటనకు త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నారు. చిన్న పార్టీలు బలంగా ఉన్న స్థానాల్లోనే వారికి సీట్లు కేటాయించేలా అఖిలేష్ యాదవ్ వ్యూహరచన చేస్తున్నారు. మొత్తం మీద బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత అఖిలేష్ తన వ్యూహాన్ని మార్చుకున్నట్లే కన్పిస్తుంది.

Related Posts