YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కలిసొస్తుందా... విసిగిస్తుందా

కలిసొస్తుందా... విసిగిస్తుందా

హైదరాబాద్, నవంబర్ 23, 
బీజేపీ చేస్తున్న ప్రచారానికి అనుగుణంగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో కలసి చర్చించడం హాట్ టాపిక్ గా మారింది. ఓల్డ్ సిటీలో పట్టు కోసం కేసీఆర్ ఎంఐఎంతో మిత్రత్వాన్ని కొనసాగిస్తున్నారు. బీజేపీ కూడా ఇప్పటికే ఓల్డ్ సిటీని ఒవైసీ కుటుంబానికి అప్పగించిందన్న ప్రచారం ప్రారంభించింది. దీన్ని నిజం చేస్తూ కేసీఆర్ ఒవైసీతో భేటీపై సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం ప్రారంభమయింది.హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు డిసెంబరు మొదటి వారంలో జరగనున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమితో ఎలాగైనా ఈ ఎన్నికలలో బీజేపీని దెబ్బతీయాలన్న లక్ష్యంతో కేసీఆర్ ఉన్నారు. గ్రేటర్ ఎన్నికలు మాత్రమే కాకుండా పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునేందుకు కేసీఆర్ ఒవైసీతో భేటీ అయినట్లు సమాచారం. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎంఐఎం సహకరించనందుకే ఓటమి పాలయ్యామన్న అభిప్రాయమూ ఉంది.గతంలో జరిగిన ఎన్నికలో గ్రేటర్ హైదరాబాద్ లో ఎంఐఎం గణనీయమైన స్థానాలను సాధించింది. మొత్తం గ్రేటర్ లో 150 వార్డులుండగా 99 స్థానాలను టీఆర్ఎస్, 40 స్థానాల వరకూ ఎంఐఎం గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోకపోయినా అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అదే రీతిలో ఈ ఎన్నికల్లోనూ ఎంఐఎంతో కేసీఆర్ అవగాహనకు వచ్చే అవకాశముంది. తమకు పట్టున్న ప్రాంతంలో ఎంఐఎం బలహీన అభ్యర్థులను పోటీ చేసేలా వ్యూహరచన చేయనున్నారు.అయితే కేసీఆర్ ఈ చర్య ఎంతవరకూ సత్ఫలితాలనిస్తుందనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే బీజేపీ హిందుత్వ నినాదాన్ని బలంగా తీసుకెళుతోంది. ఎంఐఎం, కేసీఆర్ మిలాఖత్ అయిన విషయాన్ని తీసుకెళ్లి టీఆర్ఎస్ కు నష్టం చేకూర్చాలన్నది కమలం పార్టీ వ్యూహంగా ఉంది. కానీ కేసీఆర్ ఇవేమీ పట్టించుకోకుండా ఒవైసీతో భేటీ అయి గ్రేటర్ ఎన్నికలపై చర్చించడం బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశముందంటున్నారు. మొత్తం మీద ఎంఐఎంతో లోపాయికారీ ఒప్పందం టీఆర్ఎస్ కు ఏ మేరకు లాభం చేకూరుస్తుందన్నది చూడాలి.

Related Posts