కోల్కతా జనవరి 23
దేశానికి నాలుగు రొటేటింగ్ రాజధానులు ఉండాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. కోల్కతాను రాజధానిగా చేసుకుని ఆంగ్లేయులు ఏలారని, అలాంటప్పుడు దేశంలో ఒక్క రాజధాని నగరమే ఎందుకు ఉండాలని ఆమె ప్రశ్నించారు. నేతాజీ 125వ జయంత్యుత్సవాన్ని 'దేశ్ నాయక్ దివస్'గా ఈరోజు జరుపుకొంటున్నామని ప్రకటించారు. కోల్కతా సిటీలో జరిగిన టీఎంసీ భారీ ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, నేతాజీని 'దేశ్నాయక్'గా రబీంద్రనాథ్ ఠాగూర్ సంబోధించారని, ఈ 'పరాక్రమ్' ఎక్కడదని ప్రశ్నించారు.ఇండియన్ నేషనల్ ఆర్మీని నేతాజీ స్థాపించినప్పుడు, గుజరాత్, బెంగాల్, తమిళనాడు ప్రజలతో సహా ప్రతి ఒక్కరిని అందులోకి తీసుకున్నారని మమతా బెనర్జీ తెలిపారు. బ్రిటిషర్ల విభజించు-పాలించు విధానానికి వ్యతిరేకంగా నేతాజీ పోరాటం సాగించారని అన్నారు.'అజాద్ హింద్ స్మారకం మనం నిర్మించుకుందాం. ఎలా నిర్మించాలో చేసి చూపిద్దాం. వాళ్లు విగ్రహాలు, పార్లమెంటు కాంప్లెక్స్ నిర్మాణాలకు వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నారు' అంటూ పరోక్షంగా కేంద్రంపై మమతా బెనర్జీ విరుచుకు పడ్డారు.