మచ్చలేని మంచి మనిషి ఎర్నన్నాయుడు
రాజమహేంద్రవరం ఫిబ్రవరి 23,
మూడు దశాబ్దాలకు మించిన రాజకీయ జీవితంలో మచ్చలేని చరిత్రను కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దివంగత కింజరాపు ఎర్నన్నాయుడు గారు సొంతం చేసుకున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. ఎర్నన్నాయుడు గారి జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు గ్రామంలోని హిందీ శిక్షణా కేంద్రంలో ఆదిరెడ్డి దంపతులు ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్, ఆదిరెడ్డి వాసు ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎర్నన్నాయుడు గారు టీడీపీకి, ప్రజలకు చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలనే కాకుండా, ఎన్టీఆర్ ను సైతం ఆకర్షించిన వ్యక్తిత్వం స్వర్గీయ ఎర్రన్నాయుడు గారిదన్నారు. ఆయన మరణం చాలా మంది ఆత్మీయుల్లో కలత రేపిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన జయంతి సందర్భంగా ఆ ప్రజానాయకున్ని స్మరించుకోవడం అదృష్టమన్నారు. ప్రజానేతగా ఉత్తరాంధ్ర ప్రజల మనసులు గెలుచుకుని, పార్లమెంటేరియన్ గా జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన తెలుగుతేజం స్వర్గీయ ఎర్రన్నాయుడు గారు అని కొనియాడారు. తెలుగు జాతి గర్వించదగ్గ ప్రముఖుడని, ఉత్తరాంద్ర రాజకీయ ఉద్ధండుడు ప్రజా సేవ కోసమే ఆయన జన్మించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కిలపర్తి శ్రీనివాస్, బొమ్మూరు మాజీ సర్పంచ్ మత్సెటి శివ సత్య ప్రసాద్, ధవళేశ్వరం మాజీ సర్పంచ్ పిన్నింటి ఏకబాబు, యర్రమోతు ధర్మ రాజు, ఆళ్ల విఠల్, స్టాఫ్ పి రామారావు, సునీత, షరీఫ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.