హైదరాబాద్
ఏపీ సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అంబులెన్సులకు తెలంగాణ-ఏపీ రాష్ట్రాల సరిహద్దులో ఆంక్షలు తొలగిపోయాయి. రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్ల నిలిపివేతపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేయడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైదరాబాద్లోని ఆస్పత్రిలో బెడ్ అందుబాటులో ఉన్నట్లుగా పత్రంతోపాటు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఈ-పాస్ ఉంటేనే పంపిస్తామని చెప్పడంతో రోగుల బంధువులు, పోలీసులకు మధ్య వాగ్వాదాలు తలెత్తాయి. శుక్రవారం సాయంత్రం కోర్టు జారీచేసిన ఆదేశాలు అందడంతో.. అంబులెన్స్లను తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. దీంతో కొద్దిసేపటి నుంచి ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్లను పోలీసులు అనుమతిస్తుండటంతో రోగుల బంధువులు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఎలాంటి పాసులు లేకున్నా కొవిడ్ బాధితుల అంబులెన్సులను పోలీసులు అనుమతిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని రామాపురం చెక్పోస్ట్ వద్ద కూడా ఉదయం నుంచి అమలు చేసిన ఆంక్షలను సడలించారు. అలాగే, జోగులాంబ జిల్లా పుల్లూరు టోల్ప్లాజా వద్ద కూడా ఏపీ అంబులెన్సులకు పోలీసులు అనుమతిస్తున్నారు. ఈ-పాస్ లేకున్నా హైదరాబాద్ వైపు వెళ్లేందుకు కొవిడ్ రోగులతో వెళ్లే అంబులెన్స్లను అనుమతిస్తున్నారు.