హైదరాబాద్ జూన్ 10
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన మూహుర్తం కూడా ఖరారయైంది. ఈ 14న ఈటల రాజేందర్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నారు. ఈటల రాజేందర్తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ జెడ్పీ మాజీ ఛైర్ పర్సన్ తుల ఉమ కూడా కాషాయం తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తమ పార్టీ సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈటల రాజేందర్, పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ 14న బీజేపీలోకి వస్తారని బండిసంజయ్ తెలిపారు.కాగా ఈ నెల 13న ఈటల ఢిల్లీ వెళ్లి నడ్డా సమక్షంలో బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఈటల రాజేందర్ బీజేపీలో చేరికపై బండి సంజయ్ క్లారిటీ ఇవ్వడంతో ఈ ప్రచారానికి తెరపడింది