కరీంనగర్, జూన్ 11,
హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచేందుకు టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తోంది. కేసీఆర్, కేటీఆర్ మినహా.. మంత్రుల్లో సగం మందికి పైగా అక్కడే మోహరించేలా వ్యూహరచన చేస్తోంది. సీఎం కేసీఆర్ నేరుగా ఉప ఎన్నిక వ్యవహారాలను కో ఆర్డినేట్ చేయనున్నారు. మంత్రి హరీశ్రావు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్కుమార్ ఎన్నికల ఇన్చార్జులుగా వ్యవహరించనున్నారు. హుజూరాబాద్లో మెజార్టీ కులాలను కో ఆర్డినేట్ చేయడానికి ఆ కులానికి చెందిన టీఆర్ఎస్ ముఖ్య నేతలను రంగంలోకి దించనున్నారు. వారికి తోడ్పాటుగా ఒక మంత్రికి బాధ్యతలు అప్పగించనున్నారు. ఆయా కులాలతో పార్టీ ఇన్చార్జులు మొదట సమావేశమై టీఆర్ఎస్కు మద్దతు తెలుపాలని కోరుతారు. తర్వాత ఇన్చార్జ్గా ఉన్న మంత్రులు వారి డిమాండ్లు తీర్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ముదిరాజ్ ఓటర్లకు ఎంపీ బండ ప్రకాశ్, ఎస్సీలకు ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, ఓసీల బాధ్యతలు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇప్పటికే అప్పగించారు. బీసీ కులాలను మంత్రి గంగుల కో ఆర్డినేట్ చేయాలని సూచించారు.. కులానికి ఒక మంత్రి, మరొక సీనియర్ నేతను ఇన్చార్జులుగా నియమించనున్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల బాధ్యతలను ఐదుగురు మంత్రులకు అప్పగించారు. సగానికిపైగా కేబినెట్ను హుజూరాబాద్లోనే మోహరించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఉద్యమ నేతలందరికీ బైపోల్ టాస్క్ అప్పగించారు. ఎన్నిక పూర్తయ్యే వరకూ వారంతా మరో పని ముట్టుకోవద్దని అధినేత తేల్చిచెప్పారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఒకటి, రెండు రోజుల్లో తన రాజీనామా లెటర్ను స్పీకర్కు అందించనున్నారు. దానికి ఆమోదం లభించగానే ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. కరోనా థర్డ్ వేవ్ ప్రభావం లేకుంటే నిర్దేశిత గడువులోగానే ఉప ఎన్నిక జరిగే అవకాశముంది. రెండు దశాబ్దాలుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ముఖ్య నేతగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈటలనే ఉండటంతో టీఆర్ఎస్ క్యాడర్ కొంత ఆయన వైపు మొగ్గుతోంది. ఎన్నికల్లో నెగ్గాలంటే కార్యకర్తలను పార్టీ వైపు తిప్పుకోవడంపైనే దృష్టి పెట్టాలని టీఆర్ఎస్ లీడర్లకు అధినేత కేసీఆర్ సూచించారు. దీంతో బూత్ కమిటీల నియామకంపై మంత్రి హరీశ్రావు నజర్ వేశారు. త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని బూత్లకు కమిటీలు వేయాలని ఆదేశించారు.ఉద్యమంలో ముందు నుంచి పనిచేసిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలే ఫ్రంట్ లైన్లో ఉండి పనిచేయాలని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఉద్యమకారుడైన ఈటల రాజేందర్ను ఎదుర్కొనేందుకు బీటీ బ్యాచ్ను ప్రయోగిస్తున్నారనే విమర్శరాకుండా జాగ్రత్త పడుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీలో చేరిన వాళ్లను సెకండ్ రోలో ఉండి పనిచేయాలని కేసీఆర్ సూచించారు. ఇన్చార్జుల నియామకంలోనూ ఇదే ఫార్ములా పాటించాలని ఆదేశించారు. ఒక్కో మండలానికి నలుగురు నుంచి ఐదురుగు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలను ఇన్చార్జులుగా నియమించనున్నారు.బూత్ కమిటీలు ఏర్పాటు చేసిన వెంటనే ప్రతి వంద మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలలోనే ఆ ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత బూత్ కమిటీ బాధ్యులు ప్రతి ఓటరును కలవాలి. పోలింగ్ తేదీ వరకు బూత్ ఇన్చార్జులు ఓటర్లతో టచ్లో ఉండాలి. ఆయా గ్రామాలు, మండల ఇన్చార్జులుగా ఉన్న నేతలు బూత్ కమిటీ బాధ్యులతో కో ఆర్డినేట్ చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. ప్రత్యర్థికి ఎవరెవరు మద్దతు తెలుపుతున్నారు, వారిని ఎలా దారిలోకి తెచ్చుకోవాలనే దానిపై ఇంటెలిజెన్స్ కానిస్టేబుళ్ల సేవలను వినియోగించుకుంటున్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాటు చేయకుండా పోలింగ్ తేదీ వరకు ఇన్చార్జులు వ్యవహరించాలని కేసీఆర్ తేల్చిచెప్పారు. తాను ఎప్పటికప్పుడు బైపోల్ ఇన్చార్జీలతో మాట్లాడుతానని, గ్రౌండ్లోనే ఉండి పనిచేయాలని ఆయన ఆదేశించారు. హుజూరాబాద్లో మొత్తం 2.05 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇందులో బీసీలు 1.02 లక్షలు. ఓసీ ఓటర్లు 40 వేలు, ఎస్సీ ఓటర్లు 52 వేలు, ఎస్టీ ఓటర్లు 2 వేలకుపైగా, మైనార్టీ ఓటర్లు 9 వేల మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో సగం మంది ఉన్న బీసీలపైనే టీఆర్ఎస్ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. మెజార్టీ కులాలైన పద్మశాలి, ముదిరాజ్, మున్నూరుకాపు, గౌడ, యాదవ, ఇతర బీసీ కులాల ఓట్లు టీఆర్ఎస్కు పడేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆ కులాలకు చెందిన పార్టీ సీనియర్ నేతలను ఇక్కడ రంగంలోకి దించనున్నారు. పద్మశాలి ఓటర్లను గులాబీ పార్టీ వైపు తిప్పుకునేందుకే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణను పార్టీలోకి ఆహ్వానించారనే చర్చ సాగుతోంది. ఈటల బలమైన బీసీ నేత కావడంతో ఆయా సామాజికవర్గాల నేతలతోనే ఆయనకు చెక్ పెట్టాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది.