YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ముఖ్యమంత్రికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

ముఖ్యమంత్రికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

హైదరాబాద్
తెలంగాణ ఆవిర్భావం నాడు రూ.16 వేల కోట్ల మిగులుతో, ధనిక రాష్ట్రంగా ప్రారంభమైన స్వరాష్ట్ర ప్రస్థానం ఎనిమిదేళ్ల మీ పాలనలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్ధితికి చేరుకుంది. విలువైన భూముల అమ్మకం, లక్షల కోట్ల అప్పులు... అది చాలదన్నట్టు ఇటీవల ప్రజలపై పలు రకాల పన్నుల భారం మోపారని టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు అయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసారు.  ఒకవైపు అప్పుల ద్వారా, మరోవైపు భూముల అమ్మకం ద్వారా, మరోవైపు పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో వ్యాట్ ద్వారా, కరెంట్ ఛార్జీల పెంపు ద్వారా, భూములు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు ద్వారా, బస్ ఛార్జీల పెంపు ద్వారా, అడ్డు అదుపులేని మద్యం అమ్మకాల ద్వారా జనంపై ఎడాపెడా భారం మోపి, ముక్కుపిండి వసూలు చేస్తోన్న లక్షల కోట్ల సొమ్ములు ఎటుపోతున్నాయో, ఏ బడా కాంట్రాక్టర్ల జేబుల్లోకి చేరుతున్నాయో తెలియని పరిస్థితని అయన అన్నారు.
తెలంగాణ ధనిక రాష్ట్రం అని మీరే చెబుతారు. పక్క రాష్ట్రాలకు వెళ్లి పరిహారాలు పంచి వస్తారు. రూ.200 కోట్లు ఖర్చు చేసి దేశవ్యాప్తంగా పత్రికల్లో మీరేదో మహానేత అయినట్టు ప్రకటనలు ఇచ్చుకుంటారు. మీ పుత్రరత్నం విదేశీ పర్యటనల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. మరోవైపు అర్థరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా... శాంతిభద్రతల పరిరక్షణలో నిద్రాహారాలు మాని పని చేసే హోం గార్డులకు జీతాలు కూడా సకాలంలో ఇవ్వరు. మీ వింధులకు, విలాసాలకు, విదేశీ విహార యాత్రలకు వందల కోట్లు ఖర్చు చేసే మీరు...నెల జీతం వస్తే కాని పూట గడవని హోం గార్డుల కుటుంబాల పరిస్థితి గురించి ఒక్కసారైనా ఆలోచన చేశారా? సకాలంలో జీతాలు ఇవ్వకుంటే వాళ్ల కుటుంబాలు ఎలా గడుస్తాయని అనుకుంటున్నారు? కట్టు బానిసల కంటే ఘోరమైన స్థితిలో పని చేసే హోంగార్డుల విషయంలో మీకు కనీస కనికరం లేదా? జూన్ నెల కూడా ముగుస్తు్న్నా... ఇంత వరకు వారికి మే నెల జీతం కూడా ఇవ్వని మీ నిర్వాకాన్ని ఏమని ప్రశ్నించాలి? అదే సమయంలో మెడల్ స్కూళ్లలో టీచింగ్ - నాన్ టీచింగ్ సిబ్బంది జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి. వారు కూడా మే నెల జీతాల కోసం చెకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. ఈ వర్గాలన్ని పేద, మధ్య తరగతికి చెందిన వారే. నెల జీతమే వారికి ఆధారం. అట్లాంటి వారి జీతాలు, జీవాతాలతో చెలగాటం ఆడుతారా? వారికి నెల జీతం ఇవ్వలేని దుస్థితి మీ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? తొలకరి మొదలై... వానాకాలం పంటకు సమయం ఆసన్నమైనా ఇంత వరకు రైతు బంధు నిధులు కూడా విడుదల చేయలేదు. ఈ సారి రైతుబంధు ఉంటుందా... ఉంటే ఎప్పుడిస్తారు... అసలు ఇస్తారా లేదా అని పేద రైతులు ఎదురు చూస్తున్నారు. మీరేమో బీఆర్ఎస్... వీఆర్ఎస్ అంటూ ప్రజలకు కనిపించకుండా, అసలు రాష్ట్రంలోనే ఉన్నారో లేదో తెలియకుండా కాలక్షేపం చేస్తున్నారు. కనీసం ఆర్థిక మంత్రైనా పరిస్థితిని సమీక్షించి, సరిదిద్దుతాడేమో అనుకుంటే ఆయన మీ రాజకీయ ప్రేలాపనలకు కోరస్ పాడే పనిలో బిజీగా ఉన్నారు.
ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోవడం, రైతులకు రైతుబంధు నిధులు ఇంకా విడుదల చేయలేకపోవడం అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక దుస్థితికి అద్దం పడుతోంది. రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ ఎంత గొప్పగా ఉందో తెలుస్తోంది. మీ దుష్టపాలనలో రాష్ట్ర ఖజానా దివాళీ తీసిందన్న విషయం అర్థమవుతోంది. అప్పులు తెచ్చుకుంటే తప్ప పూట గడవని దుస్థితికి రాష్ట్రాన్ని చేర్చారన్న విషయం తెలుస్తూనే ఉంది. తక్షణం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయండి. మీ విలాసాలు, జల్సాలు, రాజకీయ విన్యాసాలు ఆపి చిరు ఉద్యోగులైన హోం గార్డులు, మోడల్ స్కూల్స్ సిబ్బందికి తక్షణం మే నెల జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను. లేని పక్షంలో ఆయా వర్గాలకు అండగా కాంగ్రెస్ కార్యచరణ ఉంటుందని  రేవంత్ రెడ్డి లేఖలో పేర్కోన్నారు.

Related Posts