YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో మళ్లీ మహా కూటమి....

 ఏపీలో మళ్లీ మహా కూటమి....

విజయవాడ, నవంబర్ 26, 
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు పరిచయం అక్కరలేదు.ఆయన పేరుకు ముందు వెనక వైసీపీ రెబెల్ ఎంపీ అనే విశేషం తగిలించవలసిన అవసరం అసలే లేదు. ఆయన జగమెరిగిన రెబెల్. సన్నికల్లు తొక్కిన నాడే సంసారం యోగం తెలిసొచ్చింది’ అన్నట్లు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రఘురామ కృష్ణం రాజు, పొంచి ఉన్నజగన్ రెడ్డి సుందర ముదనష్ట పాలన ప్రమాదాన్నిగుర్తించారు. ఇక అక్కడి నుంచి, రచ్చబండ పెట్టి, జగన్ రెడ్డి దుర్మార్గ, దుష్ట పాలనను ఎండగడుతూ వస్తున్నారు. అందుకు, జగన్ రెడ్డి ప్రభుత్వం ఆగ్రహానికి గురయ్యారు. ఒక విధంగా అనేక కష్టాలను ఎదుర్కున్నారు.  అవును, అసలే ఆయన జగన్ రెడ్డి, పైగా ఏసు దేవునితో డైరెక్ట్ గా మాట్లాడే హాట్లైన్ సౌలభ్యమున్న దేవుని పుత్రుడు. దైవాంశ సంభూతుడైన ప్రభువు. అలా అన్ని మహిమలు, మహత్తులు, అరాచక శక్తులు ఉన్న ముఖ్యమంత్రిని విమర్శిస్తే ఆయన ఊరుకుంటారా? ఊరుకోరు, ఊరుకోలేదు.
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం ఆయన్ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించింది .సామ దాన దండోపాయాలు ప్రయోగించి, ఆయన నోటికి తాళం వేసే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం ఫలించలేదు. చివరకు పోలీసులకు పని చెప్పింది. పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడమే కాకుండా, ఆయన ఒక ఎంపీ అని అయినా చూడకుండా తమదైన పద్దతిలో ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు.ఆయన మారలేదు దారికి రాలేదు. అన్నిటినీ మించి ఆయన తన సొంత నియోజక వర్గంలో కాలుపెట్టకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. ఆయన ఎంపీగా గెలిచి మూడున్నరేళ్ళు అవుతున్నా,మొదటి ఐదారు నెలల్లో తప్పించి, ఆ తర్వాత మళ్ళీ నియోజకవర్గంలో కాలు పెట్టలేదు. పెట్టలేదు అంటే, జగన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ నాయకత్వం ఆయన నియోజక వర్గంలో అడుగు పెట్టకుండా అడ్డుకుంది.  
ఇదంతా నడుస్తున్న చరిత్ర. ఇక ప్రస్తుతంలోకి వస్తే, ఆయన ఐదేళ్ళ పదవీ కాలం ముగింపు కోస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.రాజకీయ యుద్ద సన్నాహాలు, పొత్తులు ఎత్తులపై చర్చలు మొదలయ్యాయి. లోక్ సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా  ఉన్న నేపధ్యంలో అటు అధికార వైసీపీ, ఇటు ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. ఈ నేపధ్యంలో రఘురామ కృష్ణం రాజు రాజకీయ భవిష్యత్ ఏమిటి? ఆయన మళ్ళీ నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తారా? చేస్తే, ఏ పార్టీ టికెట్ మీద పోటీ చేస్తారు? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
వైసీపీ ఆయనకు మళ్ళీ టికెట్ ఇవ్వదు. ఒక వేళ ఇచ్చినా,పుచ్చుకునేందుకు అయన సిద్దంగా లేరు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. సో... ఆయన ఏ పార్టీలో చేరతారు? అనే ప్రశ్న మళ్ళీ మరో మారు చర్చకు వచ్చింది. ఒకప్పుడు ఆయన బీజేపీలో చేరతారనే  ప్రచారం జరిగింది. మీడియాలో ముహూర్తాలు కూడా ఖరారయ్యాయి.మరోవంక  ఆయన కూడా బీజేపీ వైపు మొగ్గుచూపుతున్న సంకేతాలు ఇచ్చారు. ఢిల్లీ బీజేపీ నాయకులతో పాటుగా,నాగపూర్  ఆర్ఎస్ఎస్ నాయకులతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా వార్తలొచ్చాయి. పార్లమెంట్ లోపల వెలుపల కూడా ఆయన ఆర్ఎస్ఎస్ భాషలో మాట్లాడుతూ వచ్చారు. బీజేపీ ప్రభుత్వం కూడా ఆయనకు వై కేటగిరీ రక్షణ కలిపించడంతో పాటుగా ఇతర సదుపాయాలు కల్పించింది. అయితే, ఏమైందో ఏమో కానీ,ఆయన బీజేపీలో అయితే చేరలేదు.
అయితే అదలా ఉంటే, ఇప్పడు పుణ్య కాలం పూర్తవుతున్న నేపధ్యంలో, ఆయన తమ రాజకీయ భవిష్యత్ తో పాటుగా రాష్ట్ర రాజకీయ భవిష్యత్ ముఖ చిత్రం గురించి కూడా క్లారిటీ ఇచ్చారు.ఎవరు ఏ పార్టీలో చేరతారు,ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది,అనేది అప్రస్తుతం. ప్రజలు అయితే, ఒక నిర్ణయానికి వచ్చారు. అంతే కాదు, 2024 ఎన్నికలలో రెండు కాదు,మూడు ప్రధాన పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేస్తాయి, నిజానికి, జనం ఇప్పటికే జగన్ రెడ్డి పాలనకు వీడ్కోలు పలికేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు బంతి నాయకుల చేతిలో ఉందని, పార్టీలు కలవకపోతే నాయకులకే నష్టమన్నారు.ఇక తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమధానమే ఇచ్చారు. వైసీపీని ఓడించే ప్రధాన కూటమి అభ్యర్ధిగా పోటీ చేస్తానని, మర్మగర్భంగా అయినా, ఆయన ప్రధాన ప్రతిపక్ష (టీడీపీ) కూటమి తరపున పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. సరే, నేరుగా తెలుగు దేశం పార్టీలో చేరతారా లేక మరో రూట్’లో టీడీపీ కూటమితో జట్టు కడతారా అనే విషయాన్ని పక్కన పెడితే, నిస్సందేహంగా ఆయన టీడీపీ, చంద్రబాబు నాయుడు సారధ్యంలో టీడీపీ, బీజేపీ,జన సేన కూటమి ఏర్పడాలని కోరుకుంటున్నారు అనేది మాత్రం స్పష్టం చేశారు.అలాగే, ఆయన గద్దె దించేందుకు జట్టు కట్టే కూటమిలో రెండు పార్టీలు (టీడీపీ, జనసేన) ఖచ్చితంగా ఉంటాయని, మూడో పార్టీ (బీజేపీ) కూడా ప్రధాన ప్రతిపక్ష కూటమిలో చేరే అవకాశాలు కూడా ఉన్నాయని.. తేల్చి చెప్పారు. అంతే కాదు  కొంత తటపటాయిస్తూనే అయినా, ముసుగులో గుద్దులాట ఎందుకు.. ఓపెన్‌గా చెబుతున్నా, కచ్చితంగా మూడు పార్టీలు ఉంటాయన్నది తన నమ్మకమని స్పష్టం చేశారు. కొంతమంది రాష్ట్ర నాయకులు ఏమి చెప్పినా, ఏమి మాట్లాడినా, ఢిల్లీ నాయకత్వం మాత్రం మూడు పార్టీల కూటమి వైపే మొగ్గు చూపుతోందని, తన మనసులోని మాటను రఘురామ రాజు బయట పెట్టారు. రఘురామ కృష్ణం రాజు వ్యక్త పరిచిన అభిప్రాయాన్ని, ఆయన ఆ మనసులోని మాటను, జరుగతున్న పరిణామాలను గమనిస్తే, 2024 లో 2014 పునరావృతం కావడం ఖాయంగా కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. తెలుగు దేశం పార్టీకి లభిస్తున్న ప్రజాదరణను, అదే విధంగా వైసేపీ ప్రభుత్వం గడప గడపన ఎదుర్కున్న వ్యతిరేకతను గుర్తించే, బీజేపీ నాయకత్వం పునరాలోచనలో పడిందని, అందులో భాగంగానే, జీ-20 భాగస్వామ్య దేశాల సమావేశాలపై చర్చినేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలో, వచ్చే నెల ( డిసెంబర్) 5న ఢిల్లీలో ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ఆహ్వానం అందిందని పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి, బీజేపీ జాతీయ నాయకత్వం, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ, అవకాశం చిక్కిన ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడుతో మైత్రీని కోరుకుంటున్న సంకేతాలు ఇస్తూనే ఉన్నారని, గతంలో ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆజాదీకా అమృతోత్సవ్ పై జరిగిన సమావేశానికి కూడా చంద్రబాబుకు ఆహ్వానం అందింది.ఆ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రాబాబు నాయుడుతో కొద్ది సేపు ప్రత్యేకంగా మాట్లాడారు, ఢిల్లీ వస్తూ ఉండండని చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం పలికారు. ఇక అప్పటి నుంచీ కూడా తెలుగుదేశం, బీజేపీల మధ్య దూరం తగ్గుతూ వచ్చింది. డిసెంబర్ 5 సమావేశం తర్వాత ఈ దూరం మరింత తగ్గుతుందని, అంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి తెర వెనక సాగిస్తున్న  రాజకీయాలను పసిగట్టిన మోడీ, వారికి చెక్ పెట్టేందుకు చంద్రబాబుతో సఖ్యత కోరుకుంటున్నారని అంటున్నారు. అందుకే రాజకీయాలలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చును అంటారు.అది నిజమే అనిపిస్తోంది.

Related Posts