YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మళ్లీ బంగారం తాపడం పనులు 65 ఏళ్ల తర్వాత తొలిసారి

మళ్లీ బంగారం తాపడం పనులు 65 ఏళ్ల తర్వాత తొలిసారి

తిరుమల,  డిసెంబర్ 2,
పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. తిరుమల శ్రీవారి ఆలయ ఆనంద నిలయం బంగారు తాపడం పనుల కోసం ఫిబ్రవరి 23 నుంచి బాలాలయ నిర్మాణం ప్రారంభిస్తామని ప్రకటించింది. 6 నెలల్లో తాపడం పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి. ఈ సమయంలో శ్రీవారి దర్శనం కొనసాగుతుందని ప్రకటించారు. తాపడం పనుల కోసం భక్తులు సమర్పించిన బంగారాన్ని వినియోగిస్తామన్నారు. బంగారు తాపడం పనుల కోసం 1957-58 సంవత్సరంలో టీటీడీ అనుసరించిన విధానాన్నే అనుసరిస్తామని తెలియజేశారు. పాలక మండలి సమావేశం టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవనంలో జరిగింది. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మత్స్యకార ప్రాంతాల్లో మొదటి విడతలో 502 ఆలయాలు నిర్మించామని చెప్పారు వైవీ.సుబ్బారెడ్డి. రెండో విడతలో శ్రీవాణి ట్రస్టు నిధులతో దశలవారీగా ఆలయాల నిర్మాణం చేపడతామన్నారు. ఈ ఆలయాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు సమరసత సేవ ఫౌండేషన్‌తోపాటు దేవాదాయశాఖ ద్వారా, ఆయా జిల్లా యంత్రాంగాల ద్వారా నిర్మించేందుకు చర్యలు చేపడతామన్నారు. నేటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో ఉదయం 7.30 నుండి 8 గంటల మధ్య బ్రేక్ దర్శనం ఇస్తున్నారు. ఒక నెలపాటు ప్రయోగాత్మకంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తిరుపతి లోని మాధవంలో శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్లు, గదులు కేటాయించడం జరుగుతుందనన్నారు.జనవరి 2న వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించి గతంలో అనుసరించిన విధానాన్ని కొనసాగిస్తామన్నారు. పది రోజులపాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామనీ, ఇందుకోసం రోజుకు 25 వేలు చొప్పున 2.50 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్లైన్ లో విడుదల చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా రోజుకు 50,000 చొప్పున 5 లక్షల సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు తిరుపతిలో కౌంటర్ల ద్వారా మంజూరు చేస్తామన్నారు. దర్శన టికెట్ ఉన్నవారిని మాత్రమే ఆలయంలో దర్శనానికి అనుమతించడం జరుగుతుందనీ, దర్శన టికెట్ లేనివారు తిరుమలకు రావచ్చుగానీ దర్శనానికి అనుమతించబడరని చెప్పారు. అలిపిరి వద్ద స్పిరిచువల్ సిటీ నిర్మాణ పనులకు డిజైన్లు ఖరారు చేశామన్నారు. త్వరలో మొదటి దశ టెండర్లను పిలవడం జరుగుతుందని పేర్కొన్నారు.టీటీడీలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, కార్పొరేషన్ ఉద్యోగులకు వేతనాల పెంపునకు సంబంధించి అధ్యయనం చేసేందుకు ఈఓ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. వచ్చే బోర్డు సమావేశంలో ప్రతిపాదనలు సమర్పిస్తారనీ, భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని నందకం విశ్రాంతి గృహంలో మంచాలు తదితర ఫర్నీచర్‌ కొనుగోలుకు రూ.2.95 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో రక్షణ గోడ నిర్మాణానికి రూ.9.05 కోట్లతో టెండరుకు ఆమోదం తెలిపారన్నారు. తిరుమల బాలాజి నగర్‌ ప్రాంతంలో అంతర్గత రోడ్లు, పార్కింగ్‌ ప్రదేశం, మురుగుకాల్వల నిర్మాణానికి రూ.3.70 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. తిరుమల శ్రీ పద్మావతి విశ్రాంతిగృహం వద్ద గదుల ఆధునీకరణ ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.3.80 కోట్లు కేటాయించామన్నారు.ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల ఉత్పత్తులను రాష్ట్ర రైతు సాధికార సంస్థ సహకారంతో ఎపి మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలుకు ఆమోదం తెలిపింది టీటీడీ పాలక మండలి. అంతే కాకుండా జమ్మూలో నిర్మాణంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పలు అభివృద్ధి పనులు, వసతులు కల్పించేందుకు గాను 10 రకాల పనులను రూ.7 కోట్లతో చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతిలోని స్విమ్స్‌ ఆసుపత్రిలో బాలుర హాస్టల్‌ భవనంలో అదనపు అంతస్తు నిర్మాణానికి రూ.3.35 కోట్లు మంజూరు చేసింది. టీటీడీ ఆసుపత్రులు, డిస్పెన్సరీలకు గాను మందుల కొనుగోలుకు రూ.2.56 కోట్లు, సర్జికల్‌ సామగ్రి కొనుగోలుకు రూ.36 లక్షలు మంజూరు చేసింది. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధి పనుల కోసం రూ.3.75 కోట్లు కేటాయించింది‌. టిటిడిలో పనిచేస్తున్న రెగ్యులర్‌, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 2022 శ్రీవారి బ్రహ్మోత్సవ బహుమానం చెల్లింపునకు ఆమోదం తెలిపింది. టిటిడిలో 7 వేల మంది రెగ్యులర్‌, 14 వేల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఉన్నారు. రెగ్యులర్‌ ఉద్యోగులకు – 14వేలు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు – 6850/ బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వనుంది టీటీడీ.

Related Posts