YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బడ్జెట్ పై ఆశలతో మధ్యతరగతి...

బడ్జెట్ పై ఆశలతో మధ్యతరగతి...

హైదరాబాద్, జనవరి 28, 
కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది. ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్లో వారికి ప్రయోజనం కల్పించనుంది. వివిధ ప్రభుత్వ శాఖలు పంపించిన ప్రతిపాదనలను ఆర్థిక శాఖ క్షుణ్ణంగా పరిశీలించిందని సమాచారం. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వీటిని ప్రకటిస్తారని తెలిసింది.కేంద్ర ప్రభుత్వం 2014 తర్వాత ఆదాయ పన్ను మినహాయింపును పెంచలేదు. దివంగత ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ రూ.2.5 లక్షలకు పెంచాక దీనిని పట్టించుకోలేదు. అలాగే 2019 నుంచి స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.50,000 గానే ఉంది. ప్రభుత్వం స్టాండర్డ్‌ డిడక్షన్‌, మినహాయింపులను పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెరిగిన ద్రవ్యోల్బణం నుంచి వేతన ఆధారిత మధ్య తరగతికి ఉపశమనం కల్పిస్తారని అంటున్నారు. మిడిల్‌ క్లాస్‌ కష్టాలు తనకూ తెలుసన్న నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు.'నేనూ మధ్య తరగతి మహిళనే. వారి కష్టాలను నేను అర్థం చేసుకోగలను. నన్ను నేను మధ్య తరగతి మహిళగానే గుర్తించుకుంటాను. కాబట్టి వారి గురించి నాకు తెలుసు' అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కొన్ని రోజుల ముందు వెల్లడించారు. మధ్యతరగతి వర్గాలపై మోదీ ప్రభుత్వం కొత్తగా ఎలాంటి పన్నులు పెంచలేదని గుర్తు చేశారు. దేశంలో ఈ వర్గం పెరుగుతుండటంతో 27 నగరాల్లో మెట్రో రైలు విస్తరించామని, వంద స్మార్ట్‌ సిటీలు నిర్మిస్తున్నామని వివరించారు. వీరి కోసం ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు.'నేను మధ్య తరగతి సమస్యల్ని గుర్తించగలను. వారి కోసం ప్రభుత్వం చాలా చేసింది. ఇంకా చేస్తుంది' అని నిర్మాలా సీతారామన్‌ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పన్ను విధానాల్లో మార్పులు చేస్తుందని చాలామంది అంచనా వేస్తున్నారు. మినహాయింపులు పెంచడం, సెక్షన్‌ 80సీ పరిధి పెంచడం, కొన్నింటిని ఆ జాబితాలోంచి తొలగించి కొత్త సెక్షన్లు సృష్టించడం చేస్తుందని అంటున్నారు.మధ్యతరగతి వర్గాలకు మేలు జరిగేలా మూలధన రాబడి పన్ను నిబంధనలను ప్రభుత్వం సరళీకరిస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ మధ్య కాలంలో వీరు ఈక్విటీ మార్కెట్లలో ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారని పేర్కొన్నారు. వైద్య బీమా ప్రీమియం చెల్లింపులను సులభం చేయనుందని అంటున్నారు. జీవిత బీమా మినహాయింపు కోసం ప్రత్యేక ప్రావిజన్లు ఏర్పాటు చేస్తారని అంచనా.

Related Posts