ప్రస్తుతం కేరళ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. 80 శాతానికి పైగా కేరళ భారీ వర్షాలకు, వరదలకు మునిగిపోయింది. దీంతో చాలామంది నిరాశ్రయులయ్యారు. నిరాశ్రయులందరినీ పునరావాస కేంద్రాల్లోకి తరలించారు. వరదలకు అతలాకుతలమవుతున్న కేరళ రాష్ర్టాన్ని ఆదుకోవడానికి ప్రధాని మోదీ తక్షణ సాయం కింద రూ.500 కోట్లు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్లు, బీహార్ ప్రభుత్వం 10 కోట్లు, హర్యానా ప్రభుత్వం 10 కోట్లు ప్రకటించారు. ఎస్బీఐ కూడా తన వంతు సాయంగా 2 కోట్లను సీఎం సహాయనిధికి ఇవ్వనున్నట్లు తెలిపింది.మరోవైపు యాక్టర్ సిద్ధార్థ్ కూడా కేరళ వరద బాధితులకు తన వంతు సాయం చేయడం కోసం కేరళ డొనేషన్ చాలెంజ్ అని ఓ చాలెంజ్ను సోషల్ మీడియాలో ప్రారంభించాడు. కేరళ వరద బాధితులకు సాయం అందించాలని ఈ చాలెంజ్ను ప్రారంభించాడు. తన వంతు సాయంగా రూ.10 లక్షలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు పంపించాడు. దానికి సంబంధించిన లావాదేవీ రిసీప్ట్ను ట్వీట్ చేసి ఈ చాలెంజ్ విసిరాడు. అందరు ఈ చాలెంజ్లో పాల్గొనాలంటూ కోరాడు. సీఎం రిలీఫ్ పండ్కు డబ్బులు పంపించాలనుకునేవాళ్లు ఏ అకౌంట్కు పంపించాలో ఆ అకౌంట్ డిటెయిల్స్ కూడా ట్వీట్ చేశాడు. సిద్ధార్థ్ ట్వీట్కు స్పందించిన బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా తన వంతు సాయం చేసి అందరూ కేరళ వరద బాధితులకు సాయం చేయాలని కోరాడు. దీంతో ఒక్కసారిగా ఈ చాలెంజ్పై నెటిజన్లు స్పందించారు. తమకు చేతనైన సాయాన్ని కేరళ వరద బాధితుల కోసం చేస్తున్నారు. పనికిమాలిన కికీ చాలెంజ్ కాదు కేరళ డొనేషన్ చాలెంజ్లో అందరూ పాల్గొనండి అంటూ ట్వీట్లు చేస్తున్నారు నెటిజన్లు.