గ్రేటర్ పరిధిలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు ప్రత్యేక వ్యూహం రూపొందిస్తున్నారు. ‘గణేశ్’ సన్నాహాల్లో భాగంగా ప్రతి ఏడాది పోలీసు విభాగానికి సంబంధించి కొత్వాల్ ఒకే సమావేశం నిర్వహిస్తుంటారు.మరో వైపు పదోన్నతులు, బదిలీల ఎఫెక్ట్ భారీగా ఉంది. ఇటీవల ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీలుగా నగరానికి చెందిన దాదాపు 20 మంది స్టేషన్ హౌస్ ఆఫీసర్లు పదోన్నతి పొందారు. దీనికి తోడు ఎన్నికల వేడి నేపథ్యంలో ఈసీ నిబంధనల ప్రకారం నిర్ణీత కాలం సిటీలో పని చేసిన ఇన్స్పెక్టర్లకు బయటకు పంపకం తప్పదు. ఈ సంఖ్య దాదాపు 100కు పైగా ఉంది. ఈ ఎఫెక్ట్ గణేష్ ఉత్సవాలతో పాటు మొహరం బందోబస్తుపైనా ఉండకూడదని కొత్వాల్ అంజనీ కుమార్ నిర్ణయించారు.ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పక్కాగా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. వాస్తవంగా సాధారణ సమయంలోనే నగర పోలీసులకు గణేశ్ ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనం ప్రశాంతంగా పూర్తి చేయడం ఓ సవాల్. ఇదే సమయంలో అటు పదోన్నతులు, ఇటు ఎన్నికల ఎఫెక్ట్తో ఇన్స్పెక్టర్లు భారీ సంఖ్యలో బదిలీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్వాల్ అంజనీ కుమార్ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేశారు. గతానికి భిన్నంగా జోన్ల వారీగా ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీటిలో ఎస్సైలకూ భాగస్వామ్యం కల్పిస్తూ వారి పాత్రకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు జవాబుదారీతనం పెంచుతున్నారు. ఇప్పటికే సెంట్రల్ జోన్కు పూర్తి కాగా కొత్వాల్ దక్షిణ మండల అధికారులతో భేటీ అయ్యారు.సెక్టార్ల వారీగా గణేష్ మండపాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అవుతోంది. వీటితో పాటు జోన్ల వారీగా సమావేశాలు నిర్వహించడానికి మరో కారణం ఉందని ఉన్నతాధికారులు చెప్తున్నారు. నగరంలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్ పేర్లతో మొత్తం ఐదు జోన్లు ఉన్నాయి. దక్షణ మండలంలో సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువ. ఆపై తూర్పు, పశ్చిమ మండలాల్లోనూ ఈ ఛాయలు ఉంటాయి. ఉత్తర మండల వీటికి పూర్తి భిన్నం కాగా... హుస్సేన్సాగర్తో కూడిన సెంట్రల్ జోన్ నిమజ్జనానికి కేంద్రం. ఇలా ఒక్కో జోన్ తీరు ఒక్కోలా ఉండటంతో పాటు అక్కడి పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి. మండలాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న కొత్వాల్ అక్కడి అవసరాలకు తగ్గట్టు చర్యలకు ఆదేశిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రతి మండపం పైనా పోలీసులకు పూర్తి పట్టు ఉండాలని, ఎస్సైలు స్వయంగా వెళ్ళి పరిస్థితులు గమనిస్తుండాలని ఆయన స్పష్టం చేస్తున్నారు. మరోపక్క ఫ్లాగ్ మార్చ్లు సైతం పోలీసు స్టేషన్ల వారీగా నిర్వహిస్తున్నారు. స్థానిక పోలీసులు, ప్రత్యేక బలగాలు కలిసి తమ పరిధిలో కాలినడకన తిరుగుతూ ఆ ప్రాంతంపై పూర్తి పట్టు సంపాదించడాన్నే ఫ్లాగ్మార్చ్ అని పిలుస్తారు.