తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. భార్య, పిల్లల పేర్లపై ముగ్గురిని అమెరికాకు అక్రమ రవాణా కేసులో సోమవారం అరెస్టయిన జగ్గారెడ్డిని పోలీసులు మంగళవారం ఉదయం గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. గాంధీ ఆస్పత్రి వద్ద జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లో మండిపడ్డారు. తనపై అక్రమ కేసులు కక్ష సాధింపుల్లో భాగమేనన్నారు. కుట్రపూరితంగా తనను అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. తాను ఎవరినీ విదేశాలకు తరలించలేదన్నారు. రాజకీయంగా దెబ్బతీసేందుకే ఎన్నికల సమయంలో తనపై కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. సిద్దిపేటలో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకే తనను అరెస్ట్ చేసి కుట్ర పన్నారన్నారు. కేసీఆర్, హరీశ్ రావుపై కూడా నకిలీ పాస్పోర్ట్ కేసులున్నాయని జగ్గారెడ్డి ఆరోపించారు. 2004లో జగ్గారెడ్డి తన కుటుంబ సభ్యుల పేర్లతో ముగ్గురిని అక్రమంగా అమెరికా తీసుకెళ్లారని పోలీసుల అభియోగం.