YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీవారి చక్రస్నానానికి సర్వం సిద్ధం

శ్రీవారి చక్రస్నానానికి సర్వం సిద్ధం
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో చివరిది అతి ముఖ్యమైనదైన చక్రస్నన మహోత్సవం శుక్రవారం జరుగనుండడంతో టిటిడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తొమ్మిది రోజులు ఒక మహాయజ్ఞంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించి చివరిగా అవభృథ స్నానంతో సంపూర్ణం చేయడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. శుక్రవారం ఉదయం 5.00 నుండి 7.30 గంటల వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7.30 నుంచి 10.00 గంటల నడుమ శ్రీ భూవరాహస్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు.  అనంతరం స్వామి పుష్కరిణిలో చక్రస్నానాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.  ఈ సందర్భంగా టిటిడి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పుష్కరిణిలో గ్యాలరీలను, స్నానఘట్టాలను ఏర్పాటుచేసింది.  రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. రాత్రి 9.00 నుండి 10.00 గంటల మధ్య ధ్వజావరోహణంతో శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగియనున్నాయి.
రోజంతా చక్రస్నాన ప్రభావం : 
శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్వామి పుష్కరిణిలో నిర్వహించే చక్రస్నాన మహోత్సవం వల్ల ఈ పవిత్రజలాలు కూడా అత్యంత మహిమాన్వితం అవుతాయని పురాణ ప్రశస్తి. అయితే ఈ మహిమ రోజు యావత్తు ఉంటుందన్నది వైదికుల వాక్కు. ఈ కారణంగా భక్తులు సంయమనం పాటిస్తూ స్వామి పుష్కరిణిలో స్నానం ఆచరించవలసిందిగా టిటిడి ప్రత్యేకంగా విన్నవిస్తోంది.

Related Posts