YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్ 72 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ఖరారు

కాంగ్రెస్ 72 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ఖరారు

తెలంగాణ కాంగ్రెస్ తమ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసింది. 72 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి అధిష్టానం ముందుంచింది. జాబితాను పరిశీలించిన ఢిల్లీ పెద్దలు.. 45 స్థానాల అభ్యర్థులతో తొలి జాబితాను రూపొందించారు. మహాకూటమిలో పొత్తులపై ఇంకా స్పష్టత రాకపోవడంతో కొన్ని స్థానాలను పెండింగ్లో పెట్టారు. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను గురువారం విడుదల చేయనున్నారు. భక్తచరణ్ దాస్ సారథ్యంలోని త్రిసభ్య స్ర్కీనింగ్ కమిటీ మంగళవారం ఢిల్లీకి వెళ్లింది. బుధవారం 72 స్థానాల అభ్యర్థుల వివరాలను ఏఐసీసీ ఎన్నికల కమిటీకి అందించింది. అయితే, ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో కనీసం 45 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చారని తెలిసింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఖుంటియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, రేవంత్రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, షబ్బీర్అలీ, బోసురాజు, సలీం అహ్మద్, శ్రీనివాస్ కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ, టీజేఎస్, సీపీఐలతో పొత్తులు పెట్టుకున్న కాంగ్రెస్ తొలుత 100 స్థానాల్లో పోటీ చేయాలని భావించింది. అయితే, మూడు పార్టీలకు కేవలం 19 స్థానాలే కేటాయించడంపై ఆయా పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. గత కొద్ది రోజులుగా మహాకూటమి పార్టీలు సమావేశాలు నిర్వహిస్తున్నా సీట్ల సర్దుబాటుపై మాత్రం ఏకాభిప్రాయం కుదరలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు సూచనల మేరకు సీట్ల విషయంలో ఆ పార్టీ కాస్త పట్టువిడుపులు ప్రదర్శిస్తున్నా.. టీజేఎస్, సీపీఐ నేతలు మాత్రం రాజీ పడటం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహాకూటమి అభ్యర్థుల ప్రకటనలో జాప్యం జరుగుతోంది. అభ్యర్థుల జాబితా ప్రకటనలో ఆలస్యం జరిగితే నష్టం తప్పదని భావించిన కాంగ్రెస్ ముందుగా పొత్తుల సమస్య లేని స్థానాల్లో పోటీ చేసే తమ అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ ఇప్పటికే ప్రచారంలో ముందున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా జాబితా ప్రకటించి ప్రచారం మొదలుపెట్టాలని భావిస్తోంది. ఎన్నికలకు ఇంకా నెల రోజులు మాత్రమే సమయం ఉంది. పైగా నవంబరు 12న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ లోగానే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులు, భాగస్వామ్య పార్టీల అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి ప్రకటించాలి. ఈ నేపథ్యంలో కూటమి పార్టీలతో సీట్ల సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో సీట్ల సర్దుబాటుపై స్పష్టత వస్తుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. నవంబరు మొదటి వారంలోనే మహాకూటమి పూర్తి జాబితా ప్రకటన పూర్తవుతుందని తెలుపుతున్నారు.

Related Posts