త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి నగరంలోని 15 అసెంబ్లీ స్థానాలకు గాను 16మంది ఎన్నికల పరిశీలకులు త్వరలో రానున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ వెల్లడించారు.ఓటింగ్ శాతం పెంపు, ఈవీఎం, వీవీ ప్యాట్ల వినియోగంపై అవగాహన నిమిత్తం ఆయన శుక్రవారం పలు సీనియర్ సిటిజన్ సంఘాలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో భాగంగా తాను తప్పక ఓటింగ్లో పాల్గొంటానంటూ సీనియర్ సిటిజన్లతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ నగరానికి రానున్న 16 మంది పరిశీలకుల్లో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు కాగా, మరో ఎనిమిది మంది కేంద్రం నుంచి సాధారణ వ్యయ పరిశీలకులుగా రానున్నట్లు వివరించారు. నగరంలో ఎన్నికల నియమావళి పటిష్టంగా అమలు చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామని వివరించారు.మన దేశంలో ఉన్న ఎన్నికల ప్రక్రియ అత్యత పటిష్టంగా, క్రమబద్దంగా ఉన్నంతగా ప్రపంచంలో మరే దేశంలో లేదని వివరించారు. హైదరాబాద్ లాంటి అభివృద్ధి చెందిన, అధిక శాతం అక్షరాస్యత ఉన్న నగరాల్లో ఓటింగ్ శాతం అతి తక్కువగా ఉండటం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్ జిల్లాలో ప్రతి వెయ్యి మందికి 932 మంది ఓటర్లున్నారని, ఓటిగ్ శాతం మాత్రం 53 శాతం లోపే ఉందని వివరించారు.నగరంలో ఓటర్లు ఎక్కువ సేపు వేచి ఉండటం ఇష్టపడకపోవటం, 750 మీటర్ల కన్నా ఎక్కువ దూరం నడవలేకపోవటం వంటి ఇతరత్ర కారణాలతో వల్ల ఓటింగ్కు దూరంగా ఉంటున్నారని వివరించారు. కాలనీల్లో అత్యధిక శాతం ఓటింగ్ నమోదయ్యేలా కృషి చేసే కాలనీ సంక్షేమ సంఘాలకు తగిన గుర్తింపునిస్తామని ఆయన హామీ ఇచ్చారు.