కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఆ పార్టీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ విజయశాంతితో సమావేశమయ్యారు. విజయశాంతి నివాసంలో దాదాపు మూడు గంటల పాటు వీరిద్దరు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. తెలంగాణలో మహాకూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్లో సీట్ల సర్దుబాటుపై ఎదురవుతున్న నిరసనల అంశంతో పాటు కూటమి పార్టీలకు కేటాయించే సీట్ల గురించి కూడా విజయశాంతి,రేవంత్ చర్చించినట్లు తెలిసింది. కాంగ్రెస్లోని అసంతృప్తవాదుల ప్రభావం పార్టీపై పడకుండా తగు చర్యలు తీసుకోవాలని,టీఆర్ఎస్ను ఓడించాలన్న లక్ష్యం దెబ్బతినకుండా వ్యూహరచన చేయాలనే అంశాలపై ప్రధానంగా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, టీఆర్ఎస్ను ఓడించడం కూడా అంతే ముఖ్యమని గత కొన్ని రోజులుగా విజయశాంతి పదే పదే గుర్తుచేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో రేవంత్ రెడ్డితో ఆమె భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.