రాష్ట్ర రాజకీయాలను శాసించాలని భావిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ.. కీలకమైన రంప చోడవరం నియోజకవర్గంపై దృష్టి పెట్టింది. ఇటీవల ఇక్కడి పరిణామాలు ఆసక్తిగా మారాయి. తూర్పు గోదావరి జిల్లా పరిధి లోకి వచ్చే ఈ నియోజకవర్గంలో తెలంగాణా పరిధిలోని నాలుగు మండలాలను విలీనం చేశారు. అయితే, ఈ నాలుగు మండలాల్లోనూ సీపీఎంకు బలం ఎక్కువ. గత ఎన్నికల్లో ఇక్కడ సీపీఎం ఓటు బ్యాంకు ఎక్కువగా కనిపించింది. ప్రస్తుతం సీపీఎం-సీపీఐలు జనసేనతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ జనసేన దూకుడు ప్రదర్శించాలని ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
విలీన మండలాల్లోను, రంపచోడవరం డివిజన్లోను పలు పోరాటాలతో ఉన్న పట్టు కారణంగా రంపచోడవరం నియోజకవర్గంపై జనసేన మద్దతుతో జెండా పాతాలని సీపీఎం యోచిస్తోంది. పలు ప్రాంతాల్లో పట్టు ఉన్న సీపీఐ కూడా ఇందుకు మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన్యంలో పలు సంఘటిత, అసంఘటిత కార్మిక రంగాలతో సీపీఎం, సీపీఐలు పలు పోరాటాలు, ఉద్యమాలు సాగించడంతో ఉద్యోగులు, కార్మికులు తమకు దోహదపడతారన్నది ఈ నియోజకవర్గం విషయంలో సీపీఎం ధీమా. ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘం ఒకటి ఇక్కడ బలంగా ఉండడం కూడా తమకు అనుకూలించే అంశమని వారు భావిస్తున్నారు.ఈ రెండు పార్టీల మద్దతుతో తానే ఇక్కడ నుంచి అభ్యర్థిని నిలబెడితే బెటరని పవన్ యోచిస్తున్నట్టు సమాచారం. టీడీపీ, వైసీపీల్లో ఉన్న అసంతృప్తి శ్రేణులను కూడా ఆకర్షించి జనసేన వైపు తిప్పడం ద్వారా తమ పక్షం బలం పుంజుకుంటుందన్న భావం సీపీఎం-జనసేన నేతల్లో ఉంది. ఇప్పటికే సీపీఎం, సీపీఐలు తమ పార్టీ క్యాడర్తోపాటు అనుబంధ సంఘాలను కూడా ఇందుకోసం సమాయత్తం చేసుకున్నాయి. జనసేనతో సయోధ్యకు ముందు నుంచే రంపచోడవరం విషయంలో సీపీఎంకు ఒక స్పష్టత ఉంది. ఖచ్చితంగా 2019 ఎన్నికల్లో పోటీ చేసి తీరాలని భావించింది.మాజీ ఎంపీ మిడియం బాబూరావు, తాజా మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య పేరులే రంపచోడవరం అభ్యర్థిత్వం విషయంలో వినిపించాయి. 2014 ఎన్నికల గణాంకాలను చూస్తే భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలోని రంపచోడవరం నియోజకవర్గంలో చేరిన విలీన మండలాల్లో సీపీఎంకు 39శాతం ఓట్లు పడగా తెలుగుదేశానికి 29శాతం ఓట్లు నమోదయ్యాయి. ఈ లెక్కలతో విలీన మండలాలో సీపీఎం తన బలంపై ధీమాగా ఉంది. మరి ఇక్కడ సీపీఎం-జనసేనల మధ్య సీటు పోటీ తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.!