తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైనా ఇంకా, అభ్యర్థులను ఖరారు చేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా పాటు పలువురు సీనియర్ నేతలు సోమవారం ఢిల్లీలో రాహుల్ తో భేటీ అయ్యారు. మహాకూటమి పొత్తులకు సంబంధించిన చర్చల వివరాలను ఆయనకు వివరించారు. సీట్ల సర్దుబాటుపై చర్చలు ఎడతెగకుండా కొనసాగుతుండటం.. అటు మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాలకు పంచాల్సిన సీట్ల లెక్క తేలకపోవడంపై పార్టీ అధినేత రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. వెంటనే అభ్యర్థులను ప్రకటించాలని ఆదేశించారు. కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారుపై ఫిర్యాదులు, బీసీలకు సీట్ల కేటాయింపు, కూటమి పార్టీలకు సీట్ల పంపకం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.