శాసన సభ ఎన్నికల నిర్వహణకుగాను నియమించిన ఉద్యోగులు ఆరోగ్యపరమైన కారణాలు చూపిస్తూ విధుల మినహాయింపు కోరుతున్నారని, ఇందుకుగాను ప్రత్యేకంగా మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తున్నట్టు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ తెలిపారు. హెల్త్ గ్రౌండ్స్ పై మినహాయింపుకు వచ్చే దరఖాస్తులను ఈ మెడికల్ బోర్డు పరిశీలించి అనుమతులు జారీచేస్తేనే విధులకు మినహాయింపు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ లోపు విధులను కేటాయించిన మాదిరిగా ఎన్నికల శిక్షణకు తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొన్నారు. ఎన్నికల విధులకు నియమించిన సిబ్బందిని హాజరయ్యేలా సంబంధిత శాఖాధిపతులు చర్యలు చేపట్టాలని, లేనట్టైతే వారిపైన కూడా ఎన్నికల నియమావళిని అనుసరించి చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులపై ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని 134 క్రింద క్రమశిక్షణ చర్యలు చేపట్టడంతో పాటు ప్రాసిక్యూషన్ చేయడం జరుగుతుందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ హెచ్చరించారు. ఎన్నికల విధులకు సంబంధించి మినహాయింపు కోరుతూ పలువురు అధికారులు, సిబ్బంది తమ కార్యాలయానికి వస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధుల మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు.