తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున అభ్యర్ధులను బరిలోకి దింపాలని ఆ పార్టీ నాయకత్వంపై యువత ఒత్తిడి తీసుకువస్తున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో జనసేన అధిష్టానం తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలా? లేదంటే సమస్యలపై పోరాటాలకే పరిమితం కావాలా అనే విషయంలో అయోమయంలో పడిందట. పార్టీ ఆవిర్భావం నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే ఎక్కువ గురిపెట్టిన జనసేన తెలంగాణ విషయంలో ఎప్పూడూ వ్యాఖ్యానించిన దాఖలాలు లేవు. పైగా సమయం వచ్చినపుడు ఎన్నికల్లో పోటీ గురించి స్పష్టం చేస్తామని పార్టీ అధినేత పవన్ చెబుతూ వస్తున్నారు. తెలంగాణకు సంబంధించి రైతాంగ సమస్యలు, తాగునీటి సమస్యలు, విద్యార్థి సమస్యలు, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం మొదలైన అంశాలపై ఎప్పటికపుడు పవన్ పార్టీ ఎప్పటికప్పుడు స్పందిస్తోంది.తెలంగాణ ఎన్నికల్లో పోటీ విషయంపై స్పష్టతనివ్వలేదు. అయితే కొంతకాలంగా నిర్వహిస్తున్న పార్టీ మేథోమథన సమావేశాలకు తెలంగాణలోని యువత అధికంగా హాజరవుతూ జనసేనకు మద్దతు పలుకుతున్నదని సమాచారం. ఈ సమావేశాల్లో పాల్గొన్న యువత తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగడం ద్వారా పార్టీని పటిష్టం చేసేందుకు ఇదే మంచి అవకాశమని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నదని తెలుస్తోంది. అలాగే తెలంగాణ ఎన్నికల్లో పోటీపై వీలైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలని పార్టీ కార్యకర్తలు పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్ పై ఒత్తిడి తీసుకువస్తున్నారని సమాచారం. దీంతో ఆయన వారికి స్పష్టతపై హామీ ఇచ్చినట్టు భోగ్టటా. జనసేన పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే తాము ఎన్నికల బరిలోకి దిగేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ కొంతమంది నేతలు ముందుకు వచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పవన్ తెలంగాణలోని రాజకీయాల్లో జనసేన ప్రభావం ఎంతరవకూ ఉండవచ్చన్నదానిపై పార్టీ కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశమై సమీక్షిస్తున్నారని తెలుస్తోంది. అలాగే ఇక్కడ పార్టీకి పరాభవం ఎదురైతే పార్టీ భవితవ్యంపై ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై చర్చిస్తున్నారని సమాచారం. కాగా పవన్ తెలంగాణలో ఎన్నికల గురించి నిర్ణయం తీసుకునే లోగానే ముందస్తు ఎన్నికల ప్రకటన రావడంతో అధినేత సందిగ్ధంలో పడ్డారనే వాదన ఉంది. జనసేనకు బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు పూర్తికాకపోవడంతో పార్టీ ఏమీ చేయలేని స్థితిలో ఉందని సమాచారం. మొదట్లో జనసేన తెలంగాణలో కనీసం 23 నియోజకవర్గాల్లో, 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయాలనుకుంటోందనే వార్తలు వినిపించాయి. మరి ఇప్పుడున్న పరిస్థితిలో పనన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.