YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గజగజలాడిస్తున్న తుఫాను

గజగజలాడిస్తున్న తుఫాను
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘గజ’ తుఫాను మరో 24 గంటల్లో పెను తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం ఇది చెన్నైకి తూర్పున 540 కిలోమీటర్లు, నాగపట్నానికి ఈశాన్యంగా 640 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. ప్రస్తుతం గజ తుఫాను గంటకు 6 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ నైరుతి దిశగా సాగుతోందని వాతావరణ విభాగం వెల్లడించింది. ఇది తీరాన్ని తాకే సమయంలో దక్షిణ కోస్తా, పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడులోని తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం రాత్రి నుంచి ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి ఇప్పటికే 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని తెలియజేసింది. గురువారం మధ్యాహ్నానికి పాంబన్‌-కడలూరు మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరం దాటే సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతోపాటు కడలూరు, నాగపట్టణం, తిరువారూర్, తంజావూర్, పుదుక్కొట్టాయ్, ట్యూటికారిన్, రామనాథపురం జిల్లాల్లో కుంభ‌వృష్టి కురుస్తుందని ఐఎండీ తెలిపింది. ఈ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 20 సెం.మీ.లకు పైగా వర్షపాతం నమోదవుతుందని హెచ్చరికలు చేసింది. అండమాన్‌ వద్ద నవంబరు 8న ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి ఒడిశా వైపు, తర్వాత శనివారం మరింత బలపడి చెన్నై వైపు దిశ మార్చుకుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుఫానుకు ‘గజ’గా నామకరణం చేశారు. దీని ప్రభావంతో మంగళవారం ఉదయం నుంచే బంగళాఖాతం అల్లకల్లోలంగా ఉంది. తమిళనాడులోని విల్లుప్పురం, రామనాథపురం, పుదుకోట్టై జిల్లాలతో పాటు చెన్నై తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో విశాఖలోని యారాడ, రిషికొండ, ఆర్కే బీచ్‌లలో రెండో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ముందస్తు జాగ్రత్తగా జల విన్యాసాలను సైతం నిలిపేశారు. తుఫాను ప్రభావం దక్షిణ కోస్తాపై కూడా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు ఆదేశించారు. తుఫాను తీరం దాటే సమయంలో దిశ మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణలు అంచనా వేస్తున్నారు. గజ.. వేదారణ్యం ప్రాంతంలో తీరం దాటుతుందని అమెరికా తదితర విదేశీ వాతావరణ కేంద్రాలు ప్రకటించడం విశేషం. తుఫాను తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ హెచ్చరిచండంతో ఆ రాష్ట్ర యంత్రాంగం ముందస్తు సహాయక చర్యలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సోమవారం నుంచి అధికారులతో సమీక్షిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తర్వాత చేపట్టాల్సిన సహాయ చర్యలపై మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు చేశారు. 

Related Posts