ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రతిఒక్క ఉద్యోగి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ తెలియజేశారు. హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాలకు కేటాయించిన ఎన్నికల సిబ్బందికి తొలివిడత శిక్షణ కార్యక్రమం బుధవారం నాడు 8 ప్రాంతాల్లో నిర్వహించారు. సికింద్రాబాద్ హరిహరకళాభవన్, బంజారాహిల్స్ ముఫకంజా కళాశాలలో సిబ్బందికి నిర్వహించిన ఈ ఎన్నికల శిక్షణ కార్యక్రమాలకు దానకిషోర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దానకిషోర్ మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలో ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంపొందించడానికి పలు చైతన్య కార్యక్రమాలను చేపట్టామని, దీనిలో భాగంగా ఈ సారీ ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రతి ఉద్యోగి కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకునేలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో 23వేల మంది సిబ్బంది నేరుగా పాల్గొంటున్నారని, దీనితో పాటు మరో 10వేల మంది పోలీసు, ఇతర సహాయక సిబ్బంది హాజరవుతున్నారని తెలిపారు. ఎన్నికల నిర్వహణ అనేది ప్రతిసారి సరికొత్తగానే ఉంటుందని, ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతి అంశానికి లిఖితపూర్వక ఆదేశాలు ఉంటాయని అన్నారు. ఈ సారి ఎన్నికల నిర్వహణలో వివిప్యాట్లను ప్రత్యేకంగా ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ఎన్నికల నిర్వహణ పరంగా హైదరాబాద్ జిల్లా అత్యంత సున్నితప్రాంతమని, ఏ చిన్న సమస్య తలెత్తినా మీడియా దానిని బూతద్దంలో చూపే అవకాశం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నియమనిబంధనలను ప్రతిఒక్క ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు క్షుణ్ణంగా అద్యయనం చేయాలని సూచించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వివాదరహితంగా నిర్వహించామని వివిధ పార్టీలు, పోటీచేసే అభ్యర్థులు నిర్థారించేలా ఎన్నికల నిర్వహణ ఉండాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా ఎన్నికల వ్యయ పరిశీలకులు ఇప్పటికే హైదరాబాద్ జిల్లాకు వచ్చారని, సాధారణ పరిశీలకులు ఈ నెల 19న రానున్నారని తెలిపారు. ఎన్నికల విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులపై ప్రజాప్రాతినిద్య చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు.