తెలంగాణ విద్యుత్తు సంస్థకు అవార్డుల పంట పండింది. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించిన అవార్డుల్లో టీఎస్ ఎస్పీడీసీఎల్ నాలుగు అవార్డులను దక్కించుకుంది. ఓవరాల్ విన్నర్, ఇన్నోవేషన్ విత్ ఇంపాక్ట్ అవార్డు 2018, గ్రీన్ గ్రిడ్ అవార్డు, క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అవార్డు ఎస్పీడీసీఎల్కు దక్కాయి. బుధవారం ఢిల్లీలో జరిగిన ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ 12వ ఇండియా ఎనర్జీ సమ్మిట్లో ఎస్పీడీసీఎల్ సీఎండీ జీ రఘుమారెడ్డి అవార్డులను అందుకున్నారు. నూతన టెక్నాలజీని వినియోగిస్తూ వినియోగదారులకు నమ్మకమైన, నాణ్యమైన సేవలు అందించడంలో సంస్థ చేస్తున్న కృషికి వచ్చిన అవార్డులే నిదర్శనమని రఘుమారెడ్డి అన్నారు. మూడేండ్లలో 22,566 మిలియన్ యూనిట్ల విక్రయాలు 24,269 మిలియన్ యూనిట్లకు పెరిగాయని, 6,517 మిలియన్ యూనిట్లున్న వ్యవసాయ విద్యుత్ సరఫరా 11,368 మిలియన్ యూనిట్లుకు చేరిందని చెప్పారు.