చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ గురువారం తన అనుచరులతో కలిసి భాజపా తీర్థం పుచ్చుకున్నారు. తెరాస తనకు టికెట్ కేటాయించకపోవడంపై తీవ్ర అసంతృప్తికి గురైన ఆమెను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమెకు పార్టీ కండువా కప్పి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శోభ మాట్లాడుతూ.. గత 70రోజులుగా ఎదురు చూసినా సీఎం కేసీఆర్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తనను రాజకీయ సమాధి చేయడం కోసం డభ్భై రోజులు ఆపారని ధ్వజమెత్తారు. ప్రజల్లో బతుకుతున్న తనకు టికెట్ ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మళ్లీ అసెంబ్లీకి పంపాలని శోభ కోరారు. తనకు జరిగిన అన్యాయానికి ప్రజలే తీర్పు ఇవ్వాలన్నారు. పార్లమెంట్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కావాలని కవిత కోరుతున్నారని, తెరాసలో కవిత ఒక్కరే ఉంటే సరిపోతుందా.. వేరే మహిళలు ఉండొద్దా? అని ప్రశ్నించారు. దళిత వర్గాలను రాజకీయంగా ఎదగకుండా కేసీఆర్ అడ్డుకున్నారని విమర్శించారు.అనతరం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూనాలుగేళ్లపాటు దళిత వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ దళిత వర్గాలను రాజకీయంగా ఎదగకుండా కేసీఆర్ అడ్డుకున్నారని ఆరోపించారు. కుల భవనాల పేరుతో కులసంఘాలను మోసం చేశారని ఆయన విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెరాసకు ఓటమి తప్పదని లక్ష్మణ్ అన్నారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నాయకులు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ, కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.