అమరావతిలో కూర్చుని చర్చల మీద చర్చలు జరిపి.. నయానో భయానో అందరినీ ఒప్పించి మరీ కూకట్ పల్లి టిక్కెట్ తన బావమరిది, ఇటీవలే చనిపోయిన హరికృష్ణ కూతురు సుహాసినికి దక్కేట్టు చేసుకున్నారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. సరే ఇదంతా కూటమి లొల్లి అని వదిలేయవచ్చు.. అసలు కథ ఇక్కడే ఉంది. ఆ మధ్య నందమూరి హరికృష్ణ దుర్మరణం పాలైనప్పుడు తెరాస ప్రభుత్వం చేసిన హంగామా అంతా ఇంతా కాదు.. చావు దగ్గర్నుంచి అంత్యక్రియలు ముగిసే దాకా హంగామా చేశారు గులాబీ పార్టీ నేతలు.. ఇక ముఖ్యమంత్రి ఓ అడుగు ముందుకేసి హరికృష్ణ కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. స్మారక స్థూపానికి కూడా ప్రామిస్ చేశారు. తెలుగుదేశమంటేనే గిట్టని తెరాస పార్టీ మరి హరికృష్ణ కోసం ఇదంతా చేయటం అప్పట్లో చర్చనీయాంశం కూడా అయ్యింది. ఇది జరిగి ఎన్నో రోజులు కాలేదు.. జనం మరిచిపోయింటారులే అని అంత తేలిగ్గా తీసేయటానికి కూడా లేదు. ఇప్పుడేమో ఏకంగా కూకట్ పల్లి అసెంబ్లీ సీటు హరికృష్ణ కూతురికి కట్టబెట్టారు. నిన్నటి దాకా ఆమె ఎవరో కూడా ఎవరికీ తెలీదు. ఇంకా చెప్పాలంటే హరికృష్ణకు కూతురున్న సంగతి కూడా చాలా మందికి తెలీదు. ఇప్పుడామె ఎమ్మెల్యే అభ్యర్థి. అదీ టీడీపి తరపున. గెలుపు కోసం ఆమె ఈ ఎన్నికల్లో ఏమని ప్రచారం చేస్తుంది. అధికార పార్టీని విమర్శిస్తూ ప్రచారం చేయగలదా ? చేసి ఓట్లు రాబట్టగలదా? ఒక వేళ అదే చేస్తుందనుకుంటే, మరి తెరాస వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? హరికృష్ణ అవటానికి చంద్రబాబుకు బామ్మర్ది అయినా, తెరాస ను నందమూరి సుహాసిని ఘాటుగా విమర్శించగలదా? కోరి స్నేహ హస్తం చాచిన గులాబీతో తెగదెంపులకు సిద్ధ పడగలదా? ఇప్పుడు సిటీ జనాలందరినీ ఇదే ప్రశ్న తొలుస్తోంది. నామినేషన్ ఇంకా వేయలేదు కానీ, వేశాక ఏంటి పరిస్థితి ? అనేదే హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల ప్రచారం అందరికంటే ముందే మొదలు పెట్టిన తెరాస పార్టీ మొదట్నుంచి కూటమిలో తెలుగుదేశం పాత్రపై ఏకధాటిగా విమర్శిస్తూ వస్తోంది. చంద్రబాబు తెలంగాణను అస్థిర పరిచేందుకు కుట్రలు చేస్తున్నాడంటూ చెప్పుకొస్తోంది. తెరాస విమర్శలకు బలం చేకూరేలా కూటమిలో బాబు పావులు కదుపుతున్నాడేందుకు కూకట్ పల్లి సీటే నిదర్శనం. మొత్తానికి పెద్ద చిక్కొచ్చి పడిందే అని అటు టిడిపి క్యాడరు, ఇటు గులాబీ క్యాడరు గొణుక్కుంటున్నాయ్.