ఉమ్మడి ఏపీ సహా ఇప్పుడు తెలంగాణాలోనూ రాజకీయాల్లో నందమూరి ఫ్యామిలీ యాక్టివ్ రోల్ పోషిస్తున్న విషయం తెలి సిందే. వాస్తవానికి ఇప్పుడు ముందస్తు ముచ్చటకు తెరదీసిన తెలంగాణాలో ఇక, నారా ఫ్యామిలీ నుంచికానీ, నందమూరి ఫ్యామిలీ నుంచి కానీ ఎవరూ ఉండే పరిస్థితి లేదని, ఇక, తెలంగాణాలో నందమూరి వంశం నుంచి రాజకీయ నేతలు ఉం డబోరని అనుకున్నారు. అయితే, ఇంతలోనే ఇటీవల మృతి చెందిన నందమూరి హరికృష్ణ కుమార్తె.. సుహాసినిని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా తెరమీదికి తెచ్చారు. అంతేకాదు, ఎవ్వరూ ఊహించని విధంగా ఏపీ ప్రజలు ఎక్కువ మంది స్థిరపడిన కూకట్పల్లి నియోజకవర్గం నుంచి సుహాసినిని రంగంలోకి దింపారు.ఇక, ఈమె కనుక వచ్చే నెల 7న జరగనున్న ఎన్నికల్లో గెలుపొందితే.. తెలంగాణా ఏర్పడిన తర్వాత తొలిసారి నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక ప్రజాప్రతినిధి తెలంగాణా అసెంబ్లీలో గళం వినిపించే అవకాశం ఉంటుంది. ఇక, ఏపీ విషయానికి వస్తే.. నందమూరి ఫ్యామిలీ నుంచి హిందూపురం ఎమ్మెల్యేగా చంద్రబాబు వియ్యంకుడు, నటుడు బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఒక్క బాలయ్యకే కాకుండా నందమూరి ఫ్యామిలీ నుంచి మరొకరిని ఖచ్చితంగా రంగంలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీనికి ప్రదాన కారణం.. వచ్చే ఎన్నికలు త్రిము ఖ పోటీగా మారిన నేపథ్యంలో.. ముఖ్యంగా నటుడు పవన్ కళ్యాణ్ హవాను తట్టుకుని నిలబడేందుకు మరింత బలమైన వ్యూహంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం బాబుకు ఏర్పడింది. నందమూరి హరికృష్ణ కుమారుల్లో ఒకరికి టికెట్ ఇవ్వాలని బాబు భావించారు.. ఈ క్రమంలో ఆయన నందమూరి కళ్యాణ్రామ్ను రంగంలోకి దింపాలని విశ్వప్రయత్నాలు చేశారు. అయితే కళ్యాణ్రామ్ పోటీ చేసేందుకు ఒప్పుకోలేదు. దీంతో హరికృష్ణ కుమార్తె పోటీకి సై అన్నారు. ఇక, ఈ నేపథ్యంలో ఏపీలో నందమూరి తారకరత్న పేరు తెరమీదకు వస్తోంది. ఏపీలో ఇప్పటికే గత రెండు ఎన్నికల్లోనూ తారకరత్న పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగా ఉన్న తారకరత్న.. రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై ఇటీవల చంద్రబాబును కూడా కలిసి తనకు బాధ్యతలు అప్పగించాలని విజ్ఞప్తి కూడా చేశాడు.చంద్రబాబును కలిశాకే తారకరత్న బహిరంగ ప్రకటన చేశాడు. తనకు రాజకీయాలంటే ఇష్టమని టీడీపీలో ఏ బాధ్యత అప్పగించినా.. తన వంతు కృషి చేస్తానని చెప్పుకొచ్చాడు. దీంతో చంద్రబాబు తారకరత్నపై ఆలోచన చేస్తున్నారట. అయితే, ఈయనకు సినిమాల్లో పెద్ద పేరు రాకపోవడంతో .. రాజకీయాలైనా కలిసి వస్తాయా? లేక అనవసరంగా లేని వ్యవహారాన్ని నెత్తిన పూసుకుంటున్నానా ? అని సైతం బాబు ఆలోచిస్తున్నట్టు సమాచారం. మరి వచ్చే ఎన్నికల్లో ఇప్పటికే నారా ఫ్యామిలీ నుంచి చంద్రబాబు, లోకేష్ పోటీ చేస్తారు. ఇటు నందమూరి ఫ్యామిలీ నుంచి బాలయ్య రంగంలో ఉంటారు. మరో నందమూరి ఫ్యామిలీకి సీటు వస్తుందా ? రాదా? అన్నది వేచి చూడాలి